
విద్య, ఉపాధి కల్పనకు చర్యలు
మహారాణిపేట: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ద్వారకా నగర్లోని ఉచిత డీఎస్సీ శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కూర్చుని సిబ్బంది బోధనా తీరును మంత్రి పరిశీలించారు. అభ్యర్థుల సమస్యలు, శిక్షణ కేంద్రంలో అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్న అనంతరం అభ్యర్థులకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 3,400 మంది పేద విద్యార్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రస్తుతం మూడు నీట్ శిక్షణ కేంద్రాలే ఉన్నాయని, వీటి సంఖ్యను 10కి పెంచుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ఉన్నారు.