డబ్బులెక్కడ | - | Sakshi
Sakshi News home page

డబ్బులెక్కడ

Apr 15 2025 1:22 AM | Updated on Apr 15 2025 1:22 AM

డబ్బు

డబ్బులెక్కడ

మెట్రోపై మొద్దు నిద్ర
● రూపాయి విదల్చకుండా ప్రాజెక్టుపై మీనమేషాలు ● కనీసం సర్వేకి నిధులు అడిగినా స్పందించని ప్రభుత్వం ● సర్వే కోసం అదనపు సిబ్బందిని కేటాయించని వైనం

సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక రాజధాని చేస్తామంటూ విశాఖపై ప్రేమ ఒలకబోస్తున్న కూటమి ప్రభుత్వం, కీలకమైన మెట్రో ప్రాజెక్టుపై మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయటకు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నా.. వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టు విషయంలో సర్కారు మొద్దు నిద్ర నటిస్తోంది. ఓవైపు భూ సేకరణకు రంగం సిద్ధం చేసి.. సర్వే పనులు మొదలుపెట్టాలంటూ అధికారులను ఆదేశించిన ప్రభుత్వం.. అవసరమైన నిధులు, సిబ్బందిని అడిగితే మీనమేషాలు లెక్కిస్తోంది. భూసేకరణకు రూ.882 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పేపర్‌పై పరుగులు పెడుతున్న మెట్రో భూ సర్వే.. ప్రభుత్వ వైఖరితో అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో సర్వే ఎలా చేయాలన్న దానిపై జిల్లా అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది.

మరోసారి సర్వేకు ఆదేశాలు.. కానీ..!

గతంలో చేసిన సర్వేలో 4 కారిడార్లలో మెట్రో స్టేషన్లు, 22 ఎట్‌ గ్రేడ్‌ పార్కింగ్‌లు, మల్టీలెవల్‌ పార్కింగ్‌ భవనాలు, రన్నింగ్‌ స్టేషన్లు, హనుమంతువాకలో మెయింటెనెన్స్‌ డిపో, ఇతర అవసరాలకు, పోర్టు భూమిలో ఆక్సిలరీ డిపో ఏర్పాటుకు 35.96 ఎకరాలు కలిపి మొత్తం 118.86 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో ప్రైవేట్‌ భూమి కేవలం 11.7 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి వస్తుందని.. మిగిలిన 106.66 ఎకరాలు ప్రభుత్వ భూమిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మెట్రోని మరింత జాప్యం చేసేందుకు భూ సర్వే చేయాలంటూ జిల్లా అధికారులను ఆదేశించింది. తొలి విడతలో 46 కి.మీ మేర కారిడార్‌ నిర్మాణం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం భూ సేకరణకు రూ.882 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు. మెట్రో కోసం యూనిఫైడ్‌ మెట్రోపాలిటిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (యూఎంటీఎ)ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసింది. దీని సహకారంతో సర్వే చేపట్టాలని ఆదేశించినా జిల్లా అధికారులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.

స్పెషలిస్ట్‌ సర్వేయర్లు అవసరం లేదంట

మెట్రో రైలు ప్రాజెక్టు సర్వేకు స్పెషలిస్ట్‌ సర్వేయర్లు, సిబ్బంది అవసరమని జిల్లా అధికారులు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ప్రభుత్వం మాత్రం జిల్లాలో ఉన్న సర్వేయర్లతోనే పనికానివ్వాలని ఆదేశించడం గమనార్హం. మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూడా ప్రభుత్వ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పెషలిస్ట్‌ సిబ్బంది లేకుండా సర్వే సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. దీంతో నెల రోజులుగా సర్వేకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అదేవిధంగా భూ సేకరణకు రూ.882 కోట్ల వరకూ ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో సేకరణ ఎలా సాధ్యమవుతుందంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం ప్రత్యేక సర్వేయర్లను నియమించుకునేందుకై నా నిధులు మంజూరు చేయాలని ఏపీఎంఆర్‌సీ కోరినా దానిపైనా స్పందన లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరి చూస్తే అసలు వైజాగ్‌ మెట్రోపై ప్రభుత్వానికి ఆసక్తి లేదన్నది స్పష్టమవుతోంది.

భూ సేకరణకు రూ.882 కోట్లు ఖర్చవుతుందని అంచనా

గత ప్రభుత్వం హయాంలో కీలక అడుగులు

విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ లైట్‌ మెట్రో ప్రాజెక్టు పట్టాలక్కెంచేందుకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని స్పష్టం చేస్తూ.. 2023 డిసెంబర్‌ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పీపీపీ విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ని కూడా పంపించారు. అయితే ప్రభుత్వం మారిపోవడంతో చంద్రబాబు మెట్రో ప్రాజెక్టుకు మోకాలడ్డే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరోసారి డీపీఆర్‌ తయారు చేస్తామంటూ పాత డీపీఆర్‌ని పక్కన పడేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే పాత డీపీఆర్‌కే స్వల్ప మార్పులు చేసి హడావుడి చేస్తూ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగానే కూటమి ప్రభుత్వ వ్యవహరిస్తోంది.

డబ్బులెక్కడ1
1/1

డబ్బులెక్కడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement