ఉక్కునగరం: కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోతే నిరవధిక సమ్మైకె నా వెనుకాడబోమని ఉక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఈడీ(వర్క్స్) బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో నాయకులు మాట్లాడుతూ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని రీజనల్ లేబర్ కమిషనర్ ఆదేశించినా యాజమాన్యం లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికులను తొలగించడానికి మెడికల్ టెస్టులు బలవంతం చేయడం దుర్గార్మన్నారు. మరో వెయ్యి మందిని తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. స్టీల్ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చింది కార్మికులను తొలగించడానికా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించకుండా చూడాలన్నారు. ఈనెల 23న గాజువాక నుంచి కూర్మన్నపాలెం దీక్ష శిబిరం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్లాంట్ పర్సనల్ జీఎం ఎన్.భానుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, మంత్రి రవి, కె.వంశీ, ఉరుకూటి అప్పారావు, వేణు, ఉమ్మిడి అప్పారావు, రామిరెడ్డి, చట్టి నర్సింగరావు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.