పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

Mar 13 2025 11:20 AM | Updated on Mar 13 2025 11:21 AM

● జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 29,927 మంది విద్యార్థులు ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ● డీఈవో ప్రేమ్‌ కుమార్‌ వెల్లడి

విశాఖ విద్య: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని 448 మంది పాఠశాలల నుంచి 28,528 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1,404 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఇందుకోసం జిల్లాలో 134 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎంపిక చేసిన కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు.

విధులకు అంతా సిద్ధం కావాలి

పరీక్షల నిర్వహణకు 134 మంది సీఎస్‌లు, 134 మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, 14 మంది రూట్‌ ఆఫీసర్లు, మరో 14 మంది అసిస్టెంట్‌ రూట్‌ ఆఫీసర్లను పరీక్షల పర్యవేక్షణకు వినియోగిస్తున్నామన్నారు. ఎగ్జామినేషన్‌ విధులు కేటాయించిన వారికి గురువారం శిక్షణ ఇచ్చేలా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనకాపల్లి జిల్లా నుంచి 240 మంది ఉపాధ్యాయులను రిజర్వ్‌లో ఉంచామన్నారు.

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

జిల్లాలో గుర్తించిన ఐదు సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. పరీక్షల్లో ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రశ్నా పత్రాలు కేంద్రాలకు సమీపంలోని పోలీసు స్టేషన్లలో భద్రపరచటం జరిగిందన్నారు. జిల్లాలో రవాణా సౌకర్యం, మార్కెట్‌ సముదాయాలకు దగ్గరగా, పోలీసు స్టేషన్లకు దూరంగా ఉన్న 9 పరీక్ష కేంద్రాలను సీ– కేటగిరీలో ఉన్నాయన్నారు. వీటిపై పర్యవేక్షణకు ప్రతీ కేంద్రంకు ఒక కస్టోడియన్‌ను అదనంగా నియమించామన్నారు. ఐదు ప్‌లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశామని, వీరు ప్రతీ రోజూ జిల్లా అంతటా పర్యటించి, కేంద్రాలను తనిఖీ చేస్తారన్నారు.

14 కేంద్రాల్లో ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు

ఈ సారి రెగ్యులర్‌ వారితో పాటు సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్‌) ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 938 మంది పరీక్షలకు హాజరుకానున్నారని, వీరి కోసం 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రెగ్యులర్‌ కేంద్రాల్లోనే వీరికి కూడా గదులు కేటాయించటం జరిగిందన్నారు.

నో మొబైల్‌ జోన్‌గా పరీక్ష కేంద్రాలు

పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లకూడదన్నారు. ఇన్విజిలేషన్‌ సిబ్బంది, చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు కూడా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావద్దన్నారు. కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ సూచనలకు అనుగుణంగా జిల్లాలోని మిగతా శాఖల సమన్వయంతో పరీక్షల విజయవంతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు.

పది పరీక్షలపై సీఎస్‌ కాన్ఫరెన్స్‌

మహారాణిపేట: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను, అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అమలు తీరు, పి4 మోడల్‌ సర్వే, ప్రజలకు అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement