
● అంబరం.. తొలేళ్ల సంబరం
పైడిమాంబ ప్రతిమలతో భారీ ఊరేగింపు
కంచరపాలెం : కంచరపాలెం పరిధి రామ్మూర్తిపంతులుపేట ఆరాధ్య దైవం పైడిమాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం నుంచి అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. గౌరీ సేవా సంఘం గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు కొణతాల గోవిందరాజు, బొడ్డేటి నర్సింగరావు నేతృత్వంలో సాయంత్రం 4 గంటల సమయంలో వందలాది అమ్మవారి ప్రతిమలను రామ్మూర్తి పంతులుపేట నుంచి జ్ఞానాపురం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, కాన్వెంట్ కూడలి మీదుగా తిరిగి అమ్మవారి మూలవిరాట్, ఆర్పీపేట రైల్వే గేటు వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి ప్రధాన విగ్రహాన్ని ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ దంపతులు, గ్రామ కమిటీ సభ్యులు తోడ్కొని వచ్చి తొలేళ్ల సంబరాన్ని ప్రారంభించారు. పలు వేషధారణలు, నేలవేషాలు ఆకట్టుకున్నాయి. సుమారు 385 అమ్మవారి ప్రతిమలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం ప్రధాన ఉత్సవం జరగనుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

● అంబరం.. తొలేళ్ల సంబరం

● అంబరం.. తొలేళ్ల సంబరం