పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి కృషి
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): ఆటోనగర్లోని చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంలోని ఎంఎస్ఎంఈ శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఢిల్లీ నుంచి విచ్చేసిన కేంద్ర ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డాక్టర్ ఇషితా గంగూలి త్రిపాఠి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆటోనగర్లోని విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(వాసీవా) భవనంలో ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రెడిట్ ప్రొక్యూర్మెంట్, ఎంఎస్ఎంఈ పాలసీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. యూనిట్ పెర్ఫార్మాన్స్ బట్టి సబ్సిడీ ఇవ్వాలన్నారు. సీజీటీఎంసీ అనుకున్నంత రీతిలో సాగడం లేదని, టార్గెట్ ఇవ్వాలని కోరారు. మహిళలకు ఎంఎస్ఎంఈ పార్క్లు ఏర్పాటు చేయాలని, చిన్న పరిశ్రమలకు వలంటీర్గా ఈఎస్ఐ, ఈపీఎఫ్ వర్తింప చేయకుండా చూడాలన్నారు. ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు శాశ్వతంగా స్థలం కేటాయించాలన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి త్రిపాఠి హామీ ఇచ్చారు. అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్(హైదరాబాద్) డి.చంద్రశేఖర్ ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలపై, ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్(న్యూఢిల్లీ ) ఓ.పి.సింగ్ పారిశ్రామికవేత్తలకు బ్యాంక్లు కల్పిస్తున్న రుణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాసీవా అధ్యక్షుడు ఎ.కె.బాలాజి, కార్యదర్శి డి.వినోద్, ఉపాధ్యక్షుడు ఈ.కృష్ణ ప్రసాద్, కోశాధికారి బి.ఎన్.రావు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్.గణపతి, ఐలా కార్యదర్శి చీకటి సత్యనారాయణ, ఆటోనగర్ ఎంఎస్ఎంఈ ఏడీలు, పలు బ్యాంక్ల ప్రతినిధులు, అనకాపల్లి, విశాఖ జిల్లా డీఐసీ అధికారులు పాల్గొన్నారు.