
ఎంవీపీకాలనీ: గాదిరాజు ప్యాలెస్ వేదికగా రాష్ట్ర రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్గానిక్ మేళా ప్రారంభమైంది. 60 స్టాళ్ల ద్వారా ఇక్కడ సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించారు. సేంద్రియ పంటలు, వంట పదార్థాలు, నూనెలు, ఔషధాలు, విత్తనాలు, గృహోపకరణాలు వంటి ఎన్నో సహజ సిద్ధ ఉత్పత్తులు సందర్శకులను ఆకర్షించా యి. పలు సంస్థలు మిల్లెట్స్, డ్రైఫ్రూట్స్ను విక్రయించారు. ఈ మేళా మూడు రోజుల పాటు కొనసాగుతుందని సంస్థ మార్కెటింగ్ విభాగం స్టేట్ లీడ్ బి.ప్రభాకర్ తెలిపారు.
కొబ్బరి ఉత్పత్తుల ప్రదర్శన
అనకాపల్లి జిల్లా నామవరానికి చెందిన సాంబమూర్తి అన్నపూర్ణేశ్వరి వేద వ్యవసాయ క్షేత్రం ద్వారా ఉత్పత్తి చేస్తున్న సహజ పంటలను ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రత్యేక ప్లాంట్ ద్వారా తయారు చేసిన కొబ్బరి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనలో ఉంచినట్లు సాంబమూర్తి వివరించారు. కొబ్బరికాయను తొలిచి దాని లోపలి గుజ్జుతో కలిసి కొబ్బరి వాటర్ను మార్కెటింగ్ చేస్తున్నట్లు స్టాల్ నిర్వాహకులు తెలిపారు. తాటి బెల్లం, పసుపు, వంద రకాల రైస్ ఉత్పత్తులు, గోధుమలు, మినుములు వంటి సహజ సిద్ధంగా పండించిన ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
మొక్కల పరిరక్షణకు పంచగవ్య
సాయికృష్ణ గోశాల ప్రకృతి ఉత్పత్తుల కేంద్రం ఆధ్వర్యంలో మొక్కల పరిరక్షణ కోసం ప్రత్యేక ఉత్పత్తులను విక్రయించడం అందరినీ ఆకర్షించింది. పంచగవ్వ ద్రావకాన్ని వీరు విక్రయిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసిన ఈ ద్రావకం అన్ని రకాల మొక్కల ఎదుగుదలకు దోహదం చేస్తుంది. పంచగవ్య లీటర్ రూ.200. దీంతో పాటు అగ్ని అస్త్రం, దశపర్ణి, బ్రహ్మాస్త్రం, వర్మీ కంపోస్ట్, వేప కషాయం, ఎగ్ అమినో యాసిడ్ వంటివి విక్రయిస్తున్నారు.
వినియోగదారులను ఆకట్టుకున్న ఆర్గానిక్ మేళా

