బడంగ్పేట్: బాలాపూర్కు చెందిన పీపీరెడ్డి గ్రూప్ ఆఫ్ చైర్మన్, యాదాద్రి రెడ్డి సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాల్రెడ్డి రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించి అందజేశారు. తిరుపతిలో నిర్మించే ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ నిర్మాణానికి భారీ విరాళం అందజేయడంపై రెడ్డి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపీరెడ్డిని శనివారం అభినందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, వినయ్కుమార్రెడ్డి, నరోత్తంరెడ్డి, కొలన్ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరికి గాయాలు
పహాడీషరీఫ్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘటన మరువక ముందే తుక్కుగూడ ఔటర్పై శనివారం ఉదయం మరో ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నర్సింహ అనే వ్యక్తి ఐదుగురితో కలిసి కారులో (టీజీ 08 ఏఏ 4704) ఔటర్పై శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వస్తున్నాడు. ఉదయం 11.55 గంటల సమయంలో తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్–14 సమీపంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆపడంతో, డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేక డివైడర్ను ఢీ కొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మరొకరు గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందని కారణంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజల దృష్టిని మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్కు చెందిన మహమ్మద్ షాబాజ్ అహ్మద్ అలియాస్ హైదర్ (26) ఏప్రిల్ 19న పాత సామాన్లు అమ్ముతాననే నేపంతో నాదర్గుల్లోని పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసే కుర్వ పద్మమ్మకు దగ్గరయ్యాడు. మెటీరియల్ తనిఖీ చేయాలని చెప్పి ఆమెను మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి దృష్టి మళ్లించాడు. ఆపై రహస్యంగా ఆమె ఇంటికి చేరుకొని, ఆమె చిన్నకుమారైను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించి రూ.1.40 లక్షల నగదు, 50 తులాల వెండి పట్టీలతో పరారయ్యాడు. పద్మమ్మ ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక నిఘాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి శనివారం షాబాజ్ అహ్మద్ను అరెస్టు చేశారు. అతని నుంచి రూ.50 వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి వరుస నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో 53 కేసులు ఉన్నట్లు గుర్తించారు. జైలుకు వెళ్లొచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కేసును ఛేదించిన క్రైం టీం ఎస్ఐ నోయల్రాజ్, సభ్యుల్ రవి, ఎల్లయ్య, కిరణ్, ఎండీ సంతోష్, సందీప్, శివ, సంతోష్ను సీఐ అభినందించారు.


