చేవెళ్ల: పరస్పర సహకారంతో అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మండలకేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీలు ఉండాలని, తరువాత అభివృద్ధికోసం అందరూ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజలకోసం ఎవరు మంచి పనిచేసినా అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. అనంతరం మహిళా సంఘాలకు వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఐదు మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మహిళాసంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించలేదని అసహనం
సమావేశంలో ప్రొటోకాల్ పాటించలేదని పలువురు సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. సభావేదికపైకి మున్సిపల్ కౌన్సిలర్లను పిలిచి సర్పంచులను మాత్రం ఆహ్వానించలేదన్నారు. తాము కూడా ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చామని, తమను ఒక విధంగా కౌన్సిలర్లను ఒక విధంగా చూడడం సరికాదన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య


