సాక్షి, రంగారెడ్డిజిల్లా: పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే వారు విధిగా కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కరణ్మయి కొమ్మిశెట్టి సూచించారు. ఇతర మార్గాల ద్వారా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో ‘లీగల్ అడాప్షన్ పోస్ట్ కేర్’ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దత్తతపై సరైన అవగాహన లేక చాలా మంది తప్పుడు మార్గంలో పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటున్నారని, ఆ తర్వాత ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. చట్టబద్ధమైన దత్తత కోసం కేంద్ర ప్రభుత్వం కారా పోర్టల్ను తీసుకొచ్చిందని చెప్పారు. ఔత్సాహికులు ముందుగా ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని, లీగల్గా దత్తత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.


