ఎవె‘న్యూ’ విచిత్రం.!
యాలాల: కోకట్–బాగాయిపల్లి మార్గంలో ఎవెన్యూ ప్లాంటేషన్(రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడం) కార్యక్రమంపై మండలవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ సిబ్బంది వ్యయప్రయాసాలకోర్చి నాటిన మొక్కలను, మండల అధికారులకు సమాచారం లేకుండా తొలగించారు. తొలగించిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను ఏర్పాటు చేసి ప్రతి రోజు నీళ్లు పడుతుండడం చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
6,695 మొక్కలకు రూ.97వేల ఖర్చు
2022–23 సంవత్సరానికి గాను మండల ఉపాధి హామీ సిబ్బంది ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా కోకట్ నుంచి బాగాయిపల్లి వరకు ఆర్అండ్బీ రోడ్డుకిరువైపులా మొక్కలు నాటించారు. గుల్మోర్, కానుగ, సిస్సు, రేయిన్ ట్రీ, కోనోకార్పస్ తదితర మొక్కలను ఉపాధి సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు. కోకట్ పంచాయతీ పరిధిలో రెండు వర్క్ ఐడీల పేరిట మొక్కల ఏర్పాటుకు గుంత తీయడం, నీళ్లు పట్టడం, కూలీల ఖర్చుల కలుపుకొని మొత్తం 6,695 మొక్కలకు గాను రూ.97,402లను ఖర్చు చేయగా, రాఘవాపూర్ పంచాయతీలో పరిధిలో రెండు వర్క్ ఐడీలు కలుపుకొని 11,051 మొక్కలకు గాను రూ.1.61 లక్షలను ఖర్చు చేశారు. ఈ పనులకుగాను ఎఫ్ఏ, టీఏ, ఈసీలు నిత్యం పర్యవేక్షించడం ఆ మొక్కలు భారీగా పెరిగి రోడ్డుకిరువైపులా అందంగా మారాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇటీవల కొందరూ జేసీబీలతో పెరిగిన మొక్కలను తొలగించారు. తొలగించిన మొక్కల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి ప్రతి రోజు నీరు పడుతున్నారు. రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలను అనవసరంగా తొలగించి, మళ్లీ యథాస్థానంలో కొత్త మొక్కలు నాటడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ తీవ్ర విమ ర్శలు వినిపిస్తున్నాయి. కాగా కొత్తగా మొక్కలునాటే ప్రక్రియను కడా(కొడంగల్ ఏరియా డెవలెప్మెంట్ అథారిటి)వాళ్లు చేపడుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని అటు మండల అధికారులు, సంబందిత శాఖ అధికారులు ధ్రువీకరించడం లేదు.
కోకట్–బాగాయిపల్లి మార్గంలోఏపుగా పెరిగిన చెట్ల తొలగింపు
తొలగించిన స్థానంలో మళ్లీ ప్లాంటేషన్
ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ప్రజల ఆగ్రహం
కలెక్టర్ ఫిర్యాదు చేశాం
ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను తొలగించే విషయంలో అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కలెక్టర్ నిర్ణయిస్తారు. గతంలో నాటిన మొక్కలు ధ్వంసమయ్యాయనేది వాస్తవం.
– శ్రావణ్కుమార్,
ఆర్అండ్బీ డీఈఈ తాండూరు
విచారణ చేపడుతున్నాం
కోకట్ మార్గంలో రోడ్డుకిరువైపులా పెరిగిన మొక్కలను తొలగించిన అధికారులు, వ్యక్తుల గురించి మాకు సమాచారం లేదు. గతంలో ఇదే ప్రదేశంలో ఉపాధి హామీలో భాగంగా మొక్కలు నాటినట్లు రికార్డులు ఉన్నాయి. మండల అధికారులకు ఈ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కొత్త మొక్కలు నాటే వ్యక్తుల వివరాలు సైతం మాకు తెలియదు. సంబంధిత వ్యక్తుల విషయమై విచారణ చేపడుతున్నాం.
– శ్రీనిజ, ఎంపీడీఓ యాలాల మండలం
ఎవె‘న్యూ’ విచిత్రం.!
ఎవె‘న్యూ’ విచిత్రం.!


