ముక్కిపోతున్న దొడ్డుబియ్యం
బియ్యం పాడవుతున్నాయి
కొడంగల్: మండల పరిధిలో 31 రేషన్ దుకాణాల్లో 750 క్వింటాళ్ల దొడ్డు ముక్కిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే వేలాది క్వింటాళ్ల బియ్యం నిల్వలు నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో పిండిలామారి పనిరాకుండా పోతున్నాయి. కొంత మంది డీలర్లు వాటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పందికొక్కుల పాలు
జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి వినియోగదారులకు అందజేశారు. జూన్లో చివరి వరకు దుకాణాలను తెరిచి సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. జూలై, ఆగస్టులో దుకాణాలను తెరవకపోవడంతో మిగిలిన దొడ్డు బియ్యం పంది కొక్కుల పాలైంది. బియ్యానికి పురుగు పట్టి పిండిలా మారాయి. మిగులు బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో ఉంచడంతో సన్న బియ్యానికి సైతం పురుగుపడుతోంది. గ్రామాల్లో రేషన్ దుకాణాలు చిన్న గదుల్లో ఉన్నాయి. వాటిలో నిల్వలు ఉంచడం ఇబ్బందిగా మారిందని డీలర్లు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిరుపయోగంగా ఉన్నాయి. వర్షాకాలంలో వానలకు తడిసి ముద్దయ్యాయి.
తరలించాలని డిమాండ్
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 588 రేషన్ దుకాణాల ద్వారా 8,97,270 మంది వినియోగదారులకు ప్రతీనెలా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. జిల్లాలో 2.09 లక్షల ఆహార భద్రత కార్డులు, 25వేల అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతీ నెలా జిల్లా పరిధిలో 5,200 టన్నుల బియ్యం అలాట్మెంట్ ఉంది. ఈ లెక్కన జిల్లాలోని మొత్తం రేషన్ దుకాణాల్లో మిగిలి ఉన్న బియ్యం వేలాది క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని దొడ్డు బియ్యం తరలించాలని డీలర్లు కోరుతున్నారు.
కొడంగల్లో 750 క్వింటాళ్ల మిగులు
జిల్లా వ్యాప్తంగా వేలాది క్వింటాళ్లు
డీలర్ల దగ్గరే మగ్గుతున్న పాత స్టాక్
రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా మారింది జిల్లా సివిల్ సప్లై అధికారుల తీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఉగాది కానుకగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. దీంతో మార్చి వరకు రేషన్ డీలర్ల దగ్గర మిగిలిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు లెక్కకట్టి ఉంచారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.
కొడంగల్ మండలంలో 31 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల పరిధిలో మొత్తం 750 క్వింటాళ్ల దొడ్డు బియ్యం మిగిలి ఉన్నాయి. వాటిని అధికారులు తరలించక ముక్కిపోతున్నాయి. పది నెలలుగా ఒక్క దగ్గర ఉండడం వల్ల ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారింది. చిన్న గ్రామాల్లో డీలర్ల దగ్గర మిగులు బియ్యాన్ని నిల్వ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి త్వరగా తరలించాలి.
– కె.నర్సిరెడ్డి, రేషన్ డీలర్, కొడంగల్
ముక్కిపోతున్న దొడ్డుబియ్యం


