కొనుగోల్మాల్!
కష్టాన్ని దోచుకుంటున్నారు
బషీరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఐకేపీ నిర్వాహకులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు పంచాయతీ ఎన్నికల్లో తలమునకలవడంతో రైస్ మిల్లర్ల కనుసన్నల్లో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తూకాలు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాకు 40.6 కిలోలు తూకం వేయాల్సి ఉండగా ఐకేపీ, సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో 42.250 కిలోల నుంచి గరిష్టంగా 42.5 కేజీలుగా తూకాలు వేస్తున్నారు. ఇలా ఒక్కో బస్తాకు అదనంగా 1.65 కిలోల నుంచి రెండు కిలోల వరకు రైతుల నుంచి ధాన్యం అదనంగా లూటీ చేస్తున్నారు.
మిల్లర్ల మాయాజాలం
జిల్లాలో 29 ఐకేపీ కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు 2,252 మంది రైతుల నుంచి 2,58,315 బస్తాల ధాన్యం సేకరించారు. అయితే పాడి క్లీనర్ వేస్తే బస్తాకు 40.600 కేజీలు తూకం వేయాలని, శుభ్రంలేని వడ్లు గరిష్టంగా 41 కిలోలు వరకు తూకాలు వేయొచ్చని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడే మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. బస్తాకు కనీష్టంగా 42 కిలోల ధాన్యం లేకుంటే లారీలను వాపస్ పంపిస్తామని, అంతకంటే అదనంగా తూకాలు వేసి పంపితే ‘గుడ్విల్’ఉంటుందని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలు రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని కాశీంపూర్ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 42.250 తూకం వేస్తుంటే.. యాలాల మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్లో గరిష్టంగా 42.500 కేజీలు తూకం వేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే రోజుల తరబడి వారి ధాన్యం తూకం వేయకుండా కాలయాపన చేస్తున్నారు.
3,874 క్వింటాళ్లు ధాన్యం దోపిడీ
జిల్లాలో నేటికి 2,58,315 బస్తాలు తూకాలువేసి మిల్లులకు పంపించారు. అయితే ఒక్కోబస్తాకు కనీసం 1.5 కిలోలు చొప్పున లెక్క గట్టినా 3,874 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కలిసి దోపిడీకి ప్పాడినట్లు తేటతెల్లమవుతోంది. ఒక్క క్వింటాల్కు మద్దతు ధర రూ.2,390 చొప్పున దోపిడీ జరిగిన ధాన్యం విలువ రూ.9.25 లక్షల విలువ చేస్తుంది. ఇది కేవలం ఐకేపీ కేంద్రాల్లో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లకు సంబంధించిన అంచనా మాత్రమే. ఇంకా సొసైటీల ద్వారా జరిగిన కొనుగోళ్లలోనూ ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ఇంతా జరుగుతున్నా జిల్లా సివిల్ సప్లై అధికారులు గానీ, డీఆర్డీఓ ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయం.
మిల్లర్ల కనుసన్నల్లో కొనుగోలు కేంద్రాలు
ఒక్కో బస్తాపై రెండు కిలోల అదనంగా తూకం
లేబర్ చార్జీల పేరిట క్వింటాల్కు రూ.50 వరకు వసూళ్లు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
ధాన్యం అమ్మేందుకు తీసుకువస్తే బస్తాకు 42.2 కిలోల చొప్పున తూకం వేశారు. 364 బస్తాలకు 582 కిలోల ధాన్యం అదనపు తూకంతో దోచుకున్నారు. దీంతో సుమారు రూ.13 వేలు నష్టపోయా. అధికారులను ప్రశ్నిస్తే తూకాలు వేయకుండా అడ్డుకుంటున్నారు.
– ప్రశాంత్రెడ్డి, రైతు, రెడ్డిఘణాపూర్
కొనుగోల్మాల్!


