ఇనుప పైపు పడి వ్యక్తికి గాయాలు
దుద్యాల్: బోరు వేసే వాహనం నుంచి ఇనుప పైపు పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని సంట్రకుంట తండాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాథోడ్ వెంకటేశ్ తన పొలంలో బోరు వేయడానికి వాహనాన్ని పిలిపించి వేయించారు. ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఇనుప పైపులు వాహనంలో సరిగా అమర్చకపోవడంతో పక్కన ఉన్న వెంకటేశ్పై పడ్డాయి. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అతడిని కుటుంబ సభ్యులు మహబూబ్నగర్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రసుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.
మానసిక స్థితి సరిగా లేక వెళ్లిపోయిన వైనం
యాలాల: మానసిక పరిస్థితి సరిగా లేని ఓ యువకుడు ఇంటి నుంచి ఐదేళ్ల క్రితం వెళ్లి పోయాడు. ప్రస్తుతం అతడు కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు అక్కడి అధికారులు తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యాలాల మండలానికి చెందిన శంకర్ మానసిక పరిస్థితి బాగా లేదు. ఐదేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి రైలెక్కి కేరళ రాష్ట్రానికి వెళ్లిపోయాడు. అప్పట్లో అతడి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కేరళలో ఉంటున్న శంకర్ను అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించి వివరాలు సేకరించగా, తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ముద్దాయిపేట అని తేలింది. దీంతో అక్కడి యంత్రాంగం స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. వాట్సాప్లో ఫొటో పంపడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తు పట్టారు. దీంతో శంకర్ను కేరళ నుంచి తెలంగాణకు బుధవారం తీసుకురానున్నట్లు తెలిపారు.
తాండూరు రూరల్: రైతుల పొలాల వద్ద ఉన్న బోరు మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ సంఘటన మండల పరిధిలోని వీర్ శెట్టిపల్లి, బెల్కటూర్, ఎల్మకన్నె గ్రామాల్లో చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన ప్రకారం.. వీర్శెట్టిపల్లి, బెల్కటూర్, ఎల్మకన్నె గ్రామాలు కాగ్నావాగు పరివాహన ప్రాంతాల్లో ఉన్నాయి. వాగులోంచి బోరు మోటార్ల ద్వారా నీటిని పొలాలకు పారిస్తుంటారు. గుర్తు తెలియని దుండగులు ఆ బోరు మోటార్లను దొంగలిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వీర్శెట్టిపల్లిలో బొప్పి హన్మంత్, బక్క మల్లప్ప, గుడిసె నర్సింలు, బలిజ జగదీశ్, పరమేశ్, గుడిసె అనంతప్ప, తూర్పు మల్లప్ప ఎల్మకన్నె గ్రామ రైతుల బోరు మోటర్లు చోరికి గురైనట్లు రైతులు చెప్పారు. ఈ మేరకు మంగళవారం కరన్కోట్ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు.
దోమ: జ్వరంతో బాధ పడుతూ ఓ ఆర్మీ ఉద్యోగి సోమవారం మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దోమ మండలంలోని దాదాపూర్ గ్రామానికి చెందిన తోకని అంజయ్య, కనకమ్మల రెండో కుమారుడైన శ్రీనివాస్(22) రెండేళ్ల క్రితం ఆర్మీలో జవాన్గా చేరారు. ప్రస్తుతం పంజాబ్లో విధులు నిర్వహిస్తున్న ఆయన రెండు రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యం పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం దాదాపూర్లో అధికారిక లాంఛనాలతో శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య
కడ్తాల్: మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన దంపతులు వరుసగా సర్పంచ్ పదవులను అలంకరించారు. 2018లో జీపీగా ఆవిర్భవించిన ఈగ్రామంలో 2019లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా, ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో తండాపెద్దలు సమావేశమై లోకేశ్నాయక్ను ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈనెల 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. దీంతో లోకేశ్నాయక్ సతిమణి నీలావతి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి అంజమ్మపై 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇనుప పైపు పడి వ్యక్తికి గాయాలు


