కందికి గొడ్డుకాలం
కర్ణాటక సరిహద్దులోని మూడు జిల్లాల్లో అధికం జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో కంది సాగు ప్రస్తుతం పూత దశలో.. కాతపై రైతుల్లో ఆందోళన ఇటీవల కురిసిన భారీ వర్షాలకువేల ఎకరాల్లో పంట నష్టం
తాండూరు: రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అంతగా కలిసి రాలేదు. విత్తనం వేసింది మొదలు ఏకధాటిగా భారీ వర్షాలు కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధాన పంటలైన పత్తి, కంది సాగుపై ప్రభావం పడింది. ఇప్పటికే కొందరు రైతులు వర్షాలకు దెబ్బతిన్న పంటలను తొలగించి రబీ సాగుకు సిద్ధమయ్యారు. మిగిలిన కంది పంటతో దిగుబడులు రాబట్టవచ్చని ఆశించిన వారికి తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మన జిల్లాతో పాటు కర్ణాటక సరిహద్దులోని కల్బుర్గి, బీదర్ జిల్లాల్లో సైతం ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు.
పూత దశలో తెగుళ్లు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు 1.14 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట పూతదశకు చేరింది. ఈ సమయంలో గొడ్డుమోతు, వెర్రి తెగుళ్లు ఆశించాయి. దీంతో పైరు నిలువునా ఎండిపోతోంది. ఈ సారైనా మంచి దిగుబడులు సాధించి అప్పుల సుడిగుండం నుంచి ఒడ్డున పడతామని భావించిన రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. జిల్లాలో ఈ తెగుళ్లు వేగంగా వ్యాపి చేందుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాలు పంటకు తెగుళ్లు సోకి కంది కట్టెలా మారుతోంది. తాండూరు కంది పప్పుకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో గతంలో వ్యవసాయ పరిశోథన స్థానం ఏర్పాటు చేసి కొత్త వంగడాల తయారీతోపాటు రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. కానీ అధికారులు తెగుళ్లను ముందుగా గుర్తించి రైతులను అప్రమత్తం చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇక్కడి నేలలు అనుకూలం
మన జిల్లా తోపాటు కర్ణాటక సరిహద్దులోని కల్బుర్గి, బీదర్ జిల్లాల్లో కంది పంట అత్యధికంగా సాగవుతోంది. తాండూరు, కొడంగల్ నేలలు కంది సాగు కు అనుకూలం కావడంతో దశాబ్దాలుగా రైతులు మొగ్గు చూపుతున్నారు. పూత దశలో గొడ్డుమోతు తెగుళ్లు ఆందోళన కలిగిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూత రాలిపోయిందని తెలిపారు.
పంటకు గొడ్డుమోతు, ఎండు తెగుళ్ల ఉధృతి
జిల్లాలో కంది పంట సాగు
మండలం ఎకరాల్లో
బొంరాస్పేట్ 3,900
దౌల్తాబాద్ 12,650
దుద్యాల్ 4,072
కొడంగల్ 7,000
చౌడాపూర్ 520
దోమ 2,600
కుల్కచర్ల 1,350
పరిగి 3,130
పూడూరు 3,000
బషీరాబాద్ 14,900
పెద్దేముల్ 10,300
తాండూరు 17,600
యాలాల 6,000
బంట్వారం 3,100
ధారూరు 4,700
కోట్పల్లి 2,500
మర్పల్లి 5,300
మోమిన్పేట్ 4,000
నవాబుపేట్ 2,310
వికారాబాద్ 5,100
అవగాహన కల్పిస్తాం
జిల్లాలో కంది పంటకు గొడ్డుమోతు తెగులు వ్యాప్తి చెందకుండా చ ర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ఏఓలు, ఏఈఓలు ఆదేశా లు జారీ చేశాం. రైతులకు అవగాహన కల్పించాలని సూచించాం. అధికారుల సూచనలు పాటించకపోవడంతోనే ఇలాంటి తెగుళ్లు వ్యాపిస్తున్నాయి.
– రాజరత్నం, డీఏఓ
వెంటనే నివారించాలి
గొడ్డుమోతు తెగులు చిన్న ఆకులకు విపరీతంగా నష్టం చేస్తుంది. తెగులు సోకితే పూత రాదు. మన జిల్లా తోపాటు కర్ణాటక సరిహద్దులోని జిల్లాల్లో ఈ తెగులును గుర్తించాం. నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 2 మిల్లీ లీటర్ల లీప్రోపార్గెట్ లేదా ఒక మి.లీ. స్పైరోమెసిఫెన్ లేదా ఒక మి.లీ. ఫెనాక్సక్విన్ కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లను తట్టుకునే ఐసీపీఎల్ 87119(ఆశ), ఐసీపీఎల్ 8506, బీఎన్ఎం ఆర్ 853, బీఎన్ఎంఆర్ 736 వంటి విత్తనాలు సాగు చేసుకోవడం మంచిది.
– డాక్టర్.రాజేశ్వర్రెడ్డి, శాస్త్రవేత్త, రైతు విజ్ఞాన కేంద్రం, వికారాబాద్
కందికి గొడ్డుకాలం
కందికి గొడ్డుకాలం


