
గర్భిణులకు పరీక్ష!
తాండూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పురుడు పోసు కోవాలి.. హై రిస్క్ కేసులకు కూడా ఇక్కడి వైద్యులు సుఖ ప్రసవం చేస్తారు.. మెరుగైన వైద్యం, ఉచితంగా మందులు, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది.. ఇవీ వైద్యాధికారులు తరచూ చెప్పే మాటలు. ప్రైవేటుతో పోలిస్తే సర్కారు ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నా ఇంకా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాండూరు పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణులకు సరైన వైద్య సదుపాయాలు అందక అవస్థలు పడుతున్నారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని పలువు రు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులకు సాధారణ కాన్పులు చేయడంలో తాండూరు మాతాశిశు ఆస్పత్రి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కడుపులోని శిశువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలంటే అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఎంతో కీలకం. నెల రోజులుగా ఈ పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేద ని గర్భిణులు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా వై ద్యాధికారులు విధులకు సరిగ్గా రావడం లేదని అంటున్నారు.ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పరీక్షల నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి.
‘ప్రైవేటు’కు పంపుతున్న వైనం
తాండూరు పట్టణంలోని మాతాశిశు కేంద్రానికి కొడంగల్, దౌల్తాబాద్, మర్పల్లి, బంట్వారం, బషీరాబాద్, యాలాల మండలాల నుంచి నిత్యం 20 నుంచి 30 మంది వరకు గర్భిణులు వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్షల కోసం వచ్చే వారే. మధ్యాహ్నం 2గంటల వరకు స్కానింగ్ పరీక్షలు చేయాల్సి ఉన్నా రేడియాలజిస్ట్ వైద్యుడు 11 గంటలకే పరీక్షలు ఆపేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ కోసం తెల్లవారుజామున 5 గంటలకే ఆస్పత్రికి వచ్చి క్యూలో ఉంటున్నట్లు పలువురు గర్భిణులు తెలిపారు. పది రోజులుగా స్కానింగ్ నిర్వహించే వైద్యుడు విధులకు రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ప్రైవేటుగా స్కానింగ్ చేయించుకోవాలని చెబుతున్నట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటాం
నేను హైదరాబాద్ డీసీహెచ్ఎస్గా విధులు నిర్వహించిన సమయంలోనే ఆస్పత్రుల్లో రేడియాలజిస్ట్ సమస్య తలెత్తింది. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేందుకు రేడియాలజిస్ట్లు ముందుకు రావడం లేదు. ప్రత్యేక చొరవ తీసుకొని తాండూరు మాతాశిశు కేంద్రానికి ఇద్దరు రేడియాలజిస్టులను నియమించాం. రోజూ 25 మంది గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్. సునీత సూపరింటెండెంట్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి
అల్ట్రా సౌండ్ టెస్టుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం
మాతాశిశు ఆస్పత్రిలో మహిళల పాట్లు
సుదూర ప్రాంతాల నుంచి నిత్యం 30 మందికి పైగా రాక
ఉదయం 5గంటల నుంచే ఆస్పత్రి వద్ద క్యూ
11 గంటలకే మూత పడుతున్న స్కానింగ్ గది