
బందోబస్తు మధ్య గుడిసె తొలగింపు
నందిగామ: మోత్కులగూడలోని ఓ వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన గుడిసెను గ్రామ కార్యదర్శి చెన్నయ్య శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం మాకే కేటాయించిందని ఒకరు, కాదు మాకే కేటాయించిందని మరొకరు గొడవ పడుతున్నారు. ఇరువురి మధ్య నెలకొన్న ఈవివాదం చినికిచినికి గాలివానలా మారడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఈ స్థలంలో ఓ వ్యక్తి ఇటీవల ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోయగా, ఆ స్థలం తమదేనని, తనకు పట్టాతో పాటు, ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్నామని మరో వ్యక్తి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. ఇరవై రోజులుగా ఈ పంచాయితీ కొనసాగుతోంది. ఇరువురూ ఒకరిపై ఒకరు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తనకు పట్టా ఉందని చెబుతున్న వ్యక్తి సదరు స్థలంలో ఇటీవల గుడిసె వేశారు. దీన్ని తొలగించాలని కోరుతూ మరో వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శుక్రవారం గ్రామ కార్యదర్శి చెన్నయ్య స్థానిక పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెను తొలగించారు. ఈసమయంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ సుమతిని వివరణ కోరగా.. ఇరువురు వ్యక్తులు ప్లాట్లు తమవేనంటున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు, లే అవుట్ మ్యాప్ను పరిశీలించి ప్లాటు ఎవరిదో నిర్ధారిస్తామని, అప్పటివరకు ఎవరూ అందులోకి వెళ్లకూడదని చెప్పామన్నారు.
మోత్కులగూడలో ఉద్రిక్త పరిస్థితులు
సదరు స్థలంలోకి ఎవరూ వెళ్లొద్దన్న అధికారులు