
‘ఇందిరమ్మ’లో ఇంటి దొంగలు!
బషీరాబాద్: గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ‘ఇందిరమ్మ’ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తుండగా.. కొంతమంది కింది స్థాయి నాయకులు అక్రమాలకు తెరలేపారు. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి 26 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. నలుగురు అధికార పార్టీ నేతలు వీటిని పంచుకొని రూ.3 వేలు ఇచ్చిన వారి వివరాలతో జాబితా తయారు చేసి, అధికారుల ద్వారా మంజూరు చేయించారు. అయితే ఇందులో చాలా మంది అనర్హులు ఉన్నారని బాధితులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అర్హులకు మొండిచేయి
గ్రామంలో 46 మందితో కూడిన జాబితాను నలుగురు కాంగ్రెస్ నేతలు మండల అధికారులకు అందజేశారు. అధికారులు కూడా ఎలాంటి నిబంధనలు చూడకుండా జాబితాలోని 26 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇందులో నిరుపేదలు, అర్హులైన వారికి ఇళ్లు మంజూరు కాలేదు.
ఎమ్మెల్యే హెచ్చరించినా..
స్థానిక నాయకులంతా ఒక్కటై ఇందిరమ్మ లబ్ధిదారుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు వారం రోజుల క్రితమే తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ విషయమై ఆయన సదరు నాయకులను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని గట్టిగా మందలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుపేదలకు అందని గూడు
లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు
ఎమ్మెల్యే హెచ్చరించినా మారని తీరు
రూ.10 వేలు తీసుకున్నాడు
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నా వద్ద ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.10 వేలు తీసుకున్నాడు. తీరా ప్రొసిడింగ్ రాలేదని నిలదీయగా రెండో విడతలో ఇప్పిస్తానని చెబుతున్నాడు. ఇల్లు లేకపోవడంతో ఓ చిన్న గదిలో కిరాయికి ఉంటున్నాం. ఇళ్లు ఉన్నవారికే ప్రొసీడింగ్లు ఇచ్చారు. నావద్ద డబ్బులు తీసుకుని కూడా ఇవ్వలేదు. ఈ విషయం ఎవరికై నా చెబితే రేషన్ కార్డు కూడా కట్ చేస్తామని బెదిరిస్తున్నారు.
– తెలుకూరి మంజుల, ఎక్మాయి

‘ఇందిరమ్మ’లో ఇంటి దొంగలు!