
యథేచ్ఛగా మూడు ముక్కలాట
పరిగి: పరిగి నియోజకవర్గంతో పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు జూదం ఆడుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు పరిగి పట్టణానికి వచ్చి పేకాట ఆడుతున్నారు. పట్టణాలతోపాటు ఆయా గ్రామాల శివారుల్లోని వ్యవసాయ పొలాలు, శిథిల భవనాలను అడ్డాగా చేసుకుంటున్నారు.
ఫాంహౌస్లు, లాడ్జిల్లో..
వేసవి సెలవులు కావడంతో కొంత మంది గ్రూపులుగా ఏర్పడి పేకాట ఆడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. బడాబాబులు రహస్య ప్రదేశాల్లో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. చీకటి పడింది మొదలు అర్ధరాత్రి వరకు ఇదే తంతు కొనసాగిస్తున్నారు. పరిగి పట్టణంలోని ఓ లాడ్జిలో నిత్యం పేకాట ఆడుతున్నట్లు సమాచారం. అలాగే పట్టణ శివారులోని ఫాంహౌస్లు, మన్నెగూడ పరిసర ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకున్నట్లు సమాచారం. జూదంలో డబ్బులు పోగొట్టుకొని పలువురు రోడ్డున పడుతున్నారు. మరి కొంత మంది జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జూదాన్ని అరికట్టాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
పల్లెలు, పట్టణాల్లో జోరుగా జూదం
చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు
వీధిన పడుతున్న కుటుంబాలు
పట్టించుకోని పోలీసులు
చర్యలు తీసుకుంటాం
పేకాట స్థావరాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి.. తమకు సమాచారం వచ్చిన వెంటనే దాడులు చేస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో జూదం ఆడుతున్న వారిపై నిఘా ఉంచాం. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్రెడ్డి, సీఐ, పరిగి