ప్రచార రథం అడ్డగింత
ఇద్దరిపై కేసు నమోదు
అబ్దుల్లాపూర్మెట్: బీఆర్ఎస్ కళాకారుల ప్రచార రథాన్ని అడ్డగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని చిన్నరావిరాల గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కళాకారుల ప్రచారరథం తిరుగుతుండగా అదే గ్రామానికి చెందిన బండారి సత్యనారాయణ, కళ్లెం ధర్మారెడ్డి అడ్డుకుని కళాకారులను తిట్టడటంతో పాటు బెదిరించారు. దీంతో కళాకారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మోహన్ తెలిపారు. ఇద్దరిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేశామన్నారు.
బీజేపీకి బలమైన కేడర్
మాజీ ఎంపీ కొండా
చేవెళ్ల: రాష్ట్రంలో ఎప్పుడూ హంగు పరిస్థితి రాలేదని.. ప్రజలు ఏదో ఒక పార్టీకి మోజార్టీ అందిస్తారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. మండల కేంద్రంలో శుక్రవారం బీజేపీ అభ్యర్థి కేఎస్.రత్నం నామినేషన్ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కొండా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి గ్రామాల్లో బలమైన కేడర్ ఉందని ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య కుటుంబ పాలన సాగుతుందన్నారు. రత్నం గెలుపు ఖాయమన్నారు. రెండుసార్లు ఓటమి పాలైన రత్నం మూడోసారి తప్పకుండా గెలుస్తారన్నారు. జిల్లాలో బీజేపీ అత్యధిక స్థానాలు కై వసం చేసుకుంటుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్.రత్నం, నాయకులు కంజర్ల ప్రకాశ్, ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, అనంత్రెడ్డి, రామ్దేవ్ పాల్గొన్నారు.
టీ తాగి.. రిలాక్స్ అవుతా
కేంద్ర మంత్రి వర్మ
చేవెళ్ల: బీజేపీ అభ్యర్థి నామినేషన్ కోసం వచ్చిన కేంద్రమంత్రి బీఎల్.వర్మ ఓ సాధారణ వ్యక్తిలా చేవెళ్లలోని ఓ టీస్టాల్ వద్ద టీ తాగుతూ కనిపించారు. శుక్రవారం చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కేఎస్.రత్నం నామినేషన్ ర్యాలీ, దాఖలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నామినేషన్ కేంద్రానికి వెళ్తుండగా మార్గమధ్యలో కేఎస్.రత్నం మీడియాతో మాట్లాడుతుండగా కేంద్రమంత్రి వర్మ మాత్రం ఒక సాధారణ వ్యక్తిలా పక్కనే ఉన్న టీస్టాల్ వద్దకు వెళ్లి టీ తాగారు. ఆయన పక్కనే ఓ గన్మెన్ మాత్రమే ఉన్నారు. అయితే నామినేషన్ కావటంతో ఆ రోడ్డులో పోలీసులు ఇతరులను అనుమతించలేదు. దీంతో ఆయన కాసేపు సేదతీరుతూ కనిపించారు.
34 మంది 54 సెట్ల నామినేషన్లు
మహేశ్వరం: మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం 17 మంది అభ్యర్థులు 19 సెట్ల నామినేన్లు వేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూరజ్ కుమార్ తెలిపారు. నామినేషన్ వేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పట్లోళ్ల సబితారెడ్డి, బీఎస్పీ నుంచి కొత్త మనోహర్రెడ్డి, భారతీయ క్రాంతి సంఘ్ పార్టీ నుంచి తుమ్మటి శ్రీరాములు యాదవ్, జన రాజ్యం పార్టీ నుంచి లక్ష్మణాచారి, యుగ తులిసి పార్టీ నుంచి గోలి సబిత, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖలీల్ ఉజ్ జామా వివిధ పార్టీల నుంచి నామినేష్లు అందాయి. శివసేన పార్టీ అభ్యర్థి మహేష్ ఒక్కరే రెండు సెట్లను దాఖలు చేశారు. మొత్తంగా 34 మంది అభ్యర్థులు 54 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.