ఓజిలి:అనారోగ్యానికి గురైన తల్లిని పరామర్శించేందుకు వచ్చి మధ్యాహ్నం కాలనీలోని ముగ్గురు యువకులతో సరదాగా బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువు పాలయ్యాడు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాళహస్తి సున్నపు అరుంధతివాడలో మొద్దు కిష్టయ్య, భార్య మల్లీశ్వరి నివాసం ఉంటున్నా రు. మల్లీశ్వరి అనారోగ్యానికి గురికావడంతో ఓజిలి మండలం అత్తివరం పంచాయతీ కారూరు గ్రామంలో ని ఎస్సీ కాలనీకి గత వారం రోజులు క్రితం వచ్చారు. మల్లీశ్వరి కుమారుడు మొద్దు సాయి తిరుపతి పట్టణంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో సాయి తన అమ్మమ్మ ఊరు కారూరుకు వచ్చాడు. శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాలనీకి పక్కనే పొలాల్లో కోటి బావి వద్దకు కాలనీలోని జడ విజయ్కుమార్, పాలూ రు హేమంత్, మాతయ్య అనే యువకులతో కలసి సాయి ఈతకు వెళ్లారు. నలుగురు యువకులు బావిలో దిగి గంటకు పైగా ఈతకొట్టారు. ఈ క్రమంలో మొద్దు సాయి బావిలో లోతుగా వెళ్లడంతో కింద ఉన్న బురద లో ఇరుక్కుపోయాడు. ఎంతసేసటికి సాయి బయట కు రాకపోవడంతో మిగిలిన ముగ్గురు యువకులు ఇంటికి చేరుకుని బంధువులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తన సిబ్బందితో కలసి సంఘటనస్థలం చేరుకుని వివరాలు సేకరించారు. నాయుడుపేట ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కూడా బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం బావిలోని నీటిని మోటార్లతో బయటకు తోడి బురదలో ఇరుక్కుపోయిన సాయి మృతదేహాన్ని బయటకు తీశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సాయి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాయి మృతదేహం


