తిరుమల : కర్ణాటక రాష్ట్రం, యాదగిరి జిల్లా, బిరనకల్ల తండాకు చెందిన కార్తీక్ (16) తప్పిపోయిన నేపథ్యంలో ఆ బాలుడిని తిరుమల పోలీసులు గుర్తించారు. 9వ తరగతి చదువుతున్న కార్తీక్ తల్లిదండ్రులు మందలించడంతో మార్చి 20న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ నెల 23న యాదగిరి మహిళా పోలీస్ స్టేషన్న్లో కేసు నమోదు చేశారు. యాదగిరి పోలీసుల సమాచారం మేరకు తిరుమల టూ టౌన్ టౌన్ పోలీసులు వెంటనే స్పందించారు. తిరుమల పరిధిలో ఫొటో ఆధారంగా బాలుడిని గుర్తించారు. అనంతరం బాలుడిని ఆదివారం మంగళంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహానికి అప్పగించి, తదుపరి చర్యల కోసం కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో రద్దీ నేపథ్యంలో తప్పిపోయిన వారు, ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని గుర్తించడం సవాలే అయినప్పటికీ, 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్, టీటీడీ విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో ఇలాంటి కేసులను వేగంగా ఛేదిస్తున్నామని తెలిపారు. తిరుమల టు టౌన్ పోలీసులు, యాదగిరి పోలీసుల సమన్వయాన్ని ఆయన అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్రగాయాలు
తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం.. మండలంలోని పెద్దకన్నలి పెట్రోల్ బంకు వద్ద ద్విచక్ర వాహనం, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తొట్టంబేడు ఎస్ఐ వెంకటసుబ్బయ్య, పోలీసులు క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళను
వేధించిన వ్యక్తిపై కేసు
తిరుపతి క్రైం: ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై నగరంలోని అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామకిషోర్ కథనం మేరకు.. తిరుపతిలోని వినాయకనగర్కు చెందిన ఓ మహిళ టీటీడీలో సిస్టమ్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. గతంలో కుటుంబ వివాదాల సమయంలో హేమాద్రి అనే వ్యక్తి తనను ప్రెస్ రిపోర్టర్గా పరిచయం చేసుకుని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం సాన్నిహిత్యం పెంచుకుని, ఫొటోలు సేకరించి, ఆమె వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ, వెంటాడుతూ, శారీరక హాని కలిగిస్తానని బెదిరిస్తూ వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం బాధితురాలు అలిపిరి పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును అలిపిరి పోలీస్స్టేషన్ ఎస్ఐ సీ శ్రీవాణి దర్యాప్తు చేస్తున్నారు.


