
ఇక పిల్లలకు చదువు ఎప్పుడు ?
అంగన్వాడీ కార్యకర్తలతో కూటమి ప్రభుత్వం సెల్గాటమాడుతోంది. పాతతరం ఫోన్లు ఇచ్చి అప్లోడ్ చేయాలని కార్యకర్తలను వేధింపులకు గురిచేయడంపై వారు మండిపడుతున్నారు. ప్రతి పనికి యాప్లు ఉపయోగించాల్సిన పరిస్థితుల్లో పాత ఫోన్లు వాటిని సఫోర్టు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ విషయాలను అధికారులకు చెప్పినా వినకుండా చేయాల్సిందే అంటూ పదే పదే ఒత్తిళ్లు చేయడంపై అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా అంతటా నిరసనలు , ధర్నాలు చేపట్టినా అధికారులు మొండిపట్టు వీడకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
శ్రీకాళహస్తి ప్రాజెక్టు వద్ద ఉద్యోగులు ధర్నా
పిచ్చాటూరు ప్రాజెక్టు వద్ద ఉద్యోగులు ధర్నా
తిరుపతి అర్బన్ : పాత ఫోన్లతో కొత్త యాప్స్ను అప్లోడ్ చేయలేకపోవడంతో అంగన్వాడీ వర్కర్లు అవస్థలు పడుతున్నారు. అయితే వారి కష్టాలకు పరిష్కారం చూపకుండా టార్గెట్లు ఇచ్చి పనిభారాన్ని పెంచడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫోన్లు మాకొద్దు బాబోయ్...5 జీ ఫోన్లు ఇవ్వండి అంటూ నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని వర్కర్లు ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. కానీ సమస్యకు పరిష్కారం చూపకుండా కక్ష్య పూరితంగా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనపు భారంతో అవస్థలకు గురి చేయడంపై పలువురు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. యాప్లు సపోర్టు చేసే ఫోన్లు అందించకుండా ఒత్తిళ్లు చేయడంపై ఆవేదన చెందుతున్నారు.
పనిచేయని పాత ఫోన్లు
అంగన్వాడీ వర్కర్లుకు ఇచ్చిన యాప్స్ ప్రకారం ముందుగా యాప్లో ఫేస్ క్యాప్చర్ అయితేనే ఆంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహారం అందించాలి. ఈ క్రమంలో లబ్ధిదారులకు ముఖఆధారిత గుర్తింపులో అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో కుటుంబంలో ఎవరూ వచ్చినా రేషన్ ఇచ్చేవారు. అయితే కూటమి సర్కారులో లబ్ధిదారుడు తప్పనిసరిగా చేర్చారు. ముందే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తోంది. ఈ క్రమంలో అరకొర వసతులతో అంగన్వాడీ కేంద్రాల్లో నడవాల్సి వస్తోంది. దీనికి తోడు యాప్ల మోత మరింత భారంగా మారుతుంది. మరోవైపు సిగ్నల్స్ సరిగా లేక, సర్వర్ పనిచేయక తిప్పలు పడుతుంటే.. ఇదిచాలదంటూ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు.
పనిచేయని మొబైల్స్
పెరిగిపోతున్న యాప్స్ భారం
కొత్త యాప్లకు సపోర్ట్ చేయని పాత ఫోన్లు
ఈ ఫోన్లు మాకొద్దంటూ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు
నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని సర్కార్
ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఫోన్లు అప్పగించే యత్నం
అంగన్వాడీ కార్యకర్తలు చదివిదింది పదో తరగతి. అయితే ఇంజినీరింగ్ విద్యార్థులు చేసే పరిజ్ఞానానికి చెందిన యాప్స్ ఇస్తే ఎలా చేయడం సాధ్యమంటూ పలువురు మండి పడుతున్నారు. ప్రతి లబ్ధిదారుడి ఫేస్ క్యాప్చర్ చేయాల్సి ఉంది. ఒక్కో కేంద్రంలో సగటున మూడేళ్లలోపు పిల్లలు 40 మంది ఉంటారు. మరో వైపు గర్భిణులు, బాలింతలు 10కి పైగానే ఉంటారు. అంతే కాకుండా ప్రీ స్కూల్ పిల్లలు 10కి పైగా, కిశోర బాలికలు 15 వరకు ఉంటున్నారు. వీరందరికీ ప్రతినెలా ఈకేవైసీ, ఓటీపీ, ఫేస్ క్యాప్పర్ చేయాలంటే సమయం సరిపోవడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇక పిల్లలకు చదువు ఎప్పుడు చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక పిల్లలకు చదువు ఎప్పుడు ?

ఇక పిల్లలకు చదువు ఎప్పుడు ?