
వడ్డీ వ్యాపారి నుంచి ఆటో ఇప్పించండి
చంద్రగిరి : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తమకు అందించిన ఆటోను వడ్డీ వ్యాపారీ బలవంతంగా తీసుకున్నాడని, ఆయన ఆగడాల నుంచి రక్షించి, కుటుంబానికి జీవనాధారమైన ఆటోను తమకు ఇప్పించాలంటూ బాధితులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల వివరాల మేరకు.. మండల పరిధిలోని శేషాపురానికి చెందిన శివ భార్య నందినికి ఎస్సీ కార్పొరేషన్తో పాటు మహిళా సంఘాల ద్వారా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ–ఆటోను పొందారు. అప్పటి నుంచి నందిని భర్త శివ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏ.రంగంపేటకు చెందిన పచ్చిపాల చైతన్య గతేడాది రూ.60 వేలను అప్పుగా తీసుకున్నాడు. ఆపై వడ్డీల రూపంలో సుమారు రూ.1.60 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే కొంత వడ్డీతో పాటు అసలు చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు జీవనాధారమైన ఆటోను బలవంతంగా తీసుకున్నట్లుగా బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ వారు శుక్రవారం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు.