
యువకుడి అదృశ్యం
కోట : కోటకు చెందిన ముకేష్ కుమార్ అనే యువకుడు మూడు రోజులుగా కనిపించడం లేదని అతని తండ్రి గీసూలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్కు చెందిన గీసూలాల్ కోటలో టీ దుకాణం నడుతున్నాడు. తండ్రి మందలించడంతో 18 ఏళ్ల ముకేష్కుమార్ కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా కనిపించకుండా పోయిన ముకేష్ కుమార్ ముంబయిలో ఉన్నట్లు ఆచూకీ లభించిందని రాజస్థాన్ వాసులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐకు సమాచారం ఇచ్చామన్నారు.
ఆవుల దాడి ఘటనపై
ఆందోళన వద్దు
తిరుపతి తుడా : తిరుపతిలో ఆవులు దాడి చేసినట్లు అందులో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందని, ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకున్నది కాదని నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియోను తిరుపతికి చెందిన కొందరు ముందు జాగ్రత్త కోసం కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆందోళన కలిగించే ప్రచారం మంచిది కాదని హితువు పలికారు. నగరంలో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆమె సూచించినట్లు తెలిపారు. తిరుపతికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న తరుణంలో వ్యక్తిగతంగా పశువులు పెంచుకునే వారు ఇష్టం వచ్చినట్లు రోడ్లపై వదిలి వేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈవీఎం గోదాములపై నిఘా
రేణిగుంట : జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్ర పరిచిన గోడౌన్ వద్ద నిరంతర నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్ర పరిచిన ఈవీఎంలను శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో ఈవీఎం గోడౌన్ ఇన్చార్జి, ఎస్డీసీ సుధారాణి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, రేణిగుంట తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.