
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పచ్చనేతల దౌర్జన్యం
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
తిరుపతి మంగళం /తిరుపతి అర్బన్ : తిరుపతి నగర, శివారు ప్రాంతాల్లో భూములు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, పరంబోకు స్థలాలు కనిపిస్తే పచ్చనేతలు పాగవేసేస్తున్నారు.అందులో భాగంగానే మంగళం తిరుమలనగర్ పంచాయతీ పరిధిలోని తుడా క్వార్టర్స్, బొమ్మల క్వార్టర్స్లోని చెన్నాయగుంట లెక్క దాఖలాలు 195, 226 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కొందరు శుక్రవారం ప్రయత్నించారు. ఏకంగా జేసీబీలతో గాడులు తీసి అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. అర్బన్ తహశీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో ప్రసాద్ అక్రమ నిర్మాణాలను అడ్డుకుని జేసీబీలను అక్కడ నుంచి పంపివేశారు. 195, 226 సర్వే నంబర్లలోని స్థలం ప్రభుత్వానికి చెందిందని, అందులో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో టీడీపీ నాయకులు తమకు చంద్రగిరి ఎమ్మెల్యే నాని చెప్పారని, తమ వద్ద పట్టాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే మీ వద్ద ఉన్న పత్రాలను తహశీల్దార్కు చూపించి అనుమతి తీసుకుని నిర్మాణాలు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. అంత వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించి అక్కడ నుంచి పంపించి వేశారు.