
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
● భక్తులకు స్వల్పగాయాలు
తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళుతున్న మరో కారును ఢీకొనడంతో భక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. తమిళనాడుకు చెందిన భక్తులు ఓ కారులో, తెలంగాణకు చెందిన భక్తులు మరో కారులో తిరుమల నుంచి తిరుపతికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో మొదటి ఘాట్ రోడ్డులోని రెండో మలుపు వద్ద తమిళనాడు కారు అదుపు తప్పి ముందు వెళుతున్న తెలంగాణ కారును ఢీకొంది. దీంతో కారు ముందు ఉన్న రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలలోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. తమిళనాడుకు చెందిన భక్తుల కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదంపై తిరుమల ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు.