అడ్డగోలు అడ్మిషన్లే.. పెట్టుబడి! | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు అడ్మిషన్లే.. పెట్టుబడి!

Jun 11 2025 7:44 AM | Updated on Jun 11 2025 9:26 AM

-

జిల్లాలో పేట్రేగుతున్న ప్రయివేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు

అడ్డగోలుగా అడ్మిషన్‌ ఫీజుల వసూళ్లు

పర్యవేక్షణలో విద్యాశాఖ విఫలం

ఆపసోపాలు పడుతున్న తల్లిదండ్రులు

చిత్తూరు కలెక్టరేట్‌ : తిరుపతి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్‌, ప్రైవేట్‌ యాజమాన్యాల పాఠశాలల్లో ఇష్ణారాజ్యంగా అడ్మిషన్లు చేపడుతున్నారు. ముందస్తుగా అడ్మిషన్‌ పొందితే ఫీజులో రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు కురిపిస్తున్నారు. తీరా అడ్మిషన్‌ చేసుకున్నాక ఫీజులు మరింత పెంచేసి తల్లిదండ్రులను నిలువునా ముంచేస్తున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ పేర్లతో సీట్ల దందాను కొనసాగిస్తున్నారు. ఏజెంట్లను నియమించుకుని అడ్మిషన్‌ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. విద్యను వ్యాపారంగా మార్చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.

ప్రత్యేక బ్యాచ్‌ల పేరుతో దోపిడీ
కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒక్కో బ్రాంచ్‌లో ఒక్కో ధర ఉంటోంది. ఐఐటీ, టెక్నో, స్పార్క్‌ ఇలా పలు రకాల పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యాసంస్థల్లో అడ్మిషనన్ల సమయంలో ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహించకూడదనే నిబంధన ఉంది. అయితే పలు పాఠశాలల్లో ముందస్తుగా ఎంట్రన్స్‌ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్‌ల ప్రక్రియ చేపడుతున్నారు. విద్యార్థుల నైపుణ్యాల్లో తారతమ్యాలు సృష్టించి వారు మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారు. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బ్యాచ్‌లలో భవిష్యత్‌లో ఇంజినీర్‌, డాక్టర్‌లు అయ్యేందుకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామంటూ ఇష్టానుసారం ఫీజులు పెంచేసి వసూలు చేస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం అవ్వకనే ప్రైవేట్‌, కార్పొరేట్‌ బడుల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయంటే అతిశయోక్తి కాదేమో.

గత ఐదేళ్లలో అడ్డుకట్ట
ప్రైవేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాల్లో జరుగుతున్న అడ్డగోలు వసూళ్లు, అక్రమాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రత్యేకంగా ఫీజు నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌లో నిష్ణాతులైన విద్యావేత్తలను నియమించి క్షేత్రస్థాయి పర్యవేక్షణ ముమ్మరం చేసింది. కమిషన్‌ సభ్యులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందగానే నేరుగా సంబంధిత కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టేవారు. ఏవైనా అక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పాఠశాలల అనుమతులను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టేవారు. దీంతో గత వైఎస్సార్‌సీపీ సర్కారు ఐదేళ్ల పాలనలో కార్పొరేట్‌ పాఠశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కార్పొరేట్‌ యాజమాన్యాలతో లాలూచీపడి విద్యను వ్యాపారంగా మార్చేసింది. ప్రభుత్వ బడుల బలోపేతం గాలికొదిలేసి కార్పొరేట్‌కు రెడ్‌కార్పెట్‌ వేసింది.

విద్యాశాఖ విఫలం
జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాల పాఠశాలలు నిర్వహిస్తున్న అడ్డగోలు అడ్మిషన్‌ల దోపిడీని జిల్లా విద్యాశాఖ అధికారులు అరికట్టాల్సి ఉంది. ఆయా పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీ పర్వం విద్యాశాఖ అధికారులకు తెలిసినప్పటికీ నోరు మెదపడం లేదు. ఎంఈవోలు, డీవైఈవోలు తనిఖీలు సైతం చేయడం లేదు. ఆయా విద్యాసంస్థల నిర్వాహకులతో లాలూచీ పడ్డారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముందస్తు అడ్మిషన్లు, అడ్డగోలు ఫీజుల వసూళ్ల పై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ బడులు మూసేయాల్సిందే
జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ముందస్తుగా అడ్మిషన్‌ల ప్రక్రియ మొదలు పెట్టారు. ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రికి సంబంధించిన విద్యాసంస్థలో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అధిక ఫీజులు, ముందస్తు అడ్మిషన్‌ల ప్రక్రియ వల్ల ప్రభుత్వ బడులను భవిష్యత్‌లో మూసివేయాల్సిన పరిస్థితులు వస్తాయి.

– శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యదర్శి. తిరుపతి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement