ఉగ్రవాదంపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై అప్రమత్తంగా ఉండాలి

Jun 5 2025 7:52 AM | Updated on Jun 5 2025 7:52 AM

ఉగ్రవాదంపై అప్రమత్తంగా ఉండాలి

ఉగ్రవాదంపై అప్రమత్తంగా ఉండాలి

● టీటీడీ, విజిలెన్స్‌ అధికారులతో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ

తిరుమల : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇస్లామిక్‌, తీవ్రవాదం ఉగ్రవాదం నుంచి తిరుమలను సురక్షితంగా కాపాడుకోవాలని తిరుమల అదనపు ఎస్పీ రామకష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆస్థాన మండపంలో టీటీడీ విజిలెన్స్‌, సివిల్‌, ఏఆర్‌ పోలీసులు, ఏపీఎస్పీ, ఎస్పీఎఫ్‌, ఆక్టోపస్‌, ఫైర్‌, బాంబ్‌ స్క్వాడ్‌తోపాటు టీటీడీ సిబ్బంది అర్చకులు, పోటు కార్మికులు, ట్యాక్సీ డ్రైవర్లు, మఠాల నిర్వాహ కులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇస్లామిక్‌ ఫండమెంటలిజం, టెరర్రిజం ద్వారా దాడులకు పాల్పడుతూ దేశసమగ్రతను, భద్రతను దెబ్బతీస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో హిందువుల రాజధానిగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని రక్షించుకునేందుకు ఇక్కడ పనిచేసే అధికారుల నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఉగ్రవాదులు మనతోపాటు ఉంటూ ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారని, మనమందరం అప్రమత్తంగా ఉంటూ వారి ఆచూకీ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

అనుమానాస్పద వ్యక్తులపై నిఘా

ప్రతి ఒక్కరూ తాము పనిచేసే ప్రదేశంలో అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించవచ్చునని ఏఎస్పీ తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన బాంబుదాడులు, వాటిని అమలు చేసిన విధానాన్ని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. తిరుమలలో ఉగ్రముప్పును అడ్డుకునేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేపట్టామని తెలిపారు. అందులో భాగంగానే అక్రమంగా తిరుమలలో ఉంటున్న హాకర్లు, వలసదారులను గుర్తించి 800 మందిని బలవంతంగా తిరుపతికి తరలించామన్నారు. అదేవిధంగా వారు నిర్మించుకున్న 150 షెడ్లను కూల్చివేశామని తెలిపారు. నిరంతరాయంగా భద్రతా చర్యలను కొనసాగిస్తున్నామని చెప్పారు. సమావేశంలో తిరుమల డీఎస్పీ విజయ్‌ శేఖర్‌, టీటీడీ వీజీఓ సురేంద్ర, వివిధ భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement