
జూన్ 4న వెన్నుపోటు దినం
తిరుపతి మంగళం: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు నోటికి వచ్చిన అబద్దపు హామీలు గుప్పించి మోసపూరితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా పరిగణించుకుందామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వెన్నుపోటు దినానికి సంబంధించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతో ఎన్నికల సమయంలో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే చంద్రబాబు, పవన్కల్యాణ్ వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమం, అభివృద్ధిని పక్కన పెట్టి వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు అందించని ద్రోహిహి చంద్రబాబు అన్నారు. అందుకే జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నామకరణం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు నిరసన ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు.
భూమన కరుణాకరరెడ్డి