
నయా ఫాసిజాన్ని ఎదుర్కొందాం
తిరుపతి కల్చరల్: ఎనభై ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన ఫాసిజాన్ని ప్రాణాలకు సైతం తెగించి ఎర్రసైన్యం ఎదుర్కొందని, ప్రస్తుతం విజృంభిస్తున్న నయా ఫాజిజాన్ని విశాల ఐక్య వేదికగా ప్రజలందరినీ కలుపుకుని ఎదుర్కొందామని సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏంఏ.బేబి పిలుపు నిచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతి వేదికగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫాసిజంపై ప్రజాసైన్యం విజయ స్ఫూర్తితో గురువారం కచ్చిపి ఆడిటోరియంలో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ముందు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న ఎమ్మెస్.సుబ్బలక్ష్మి విగ్రహం నుంచి కచ్చపి ఆడిటోరియం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో హిట్లర్, ముస్సోలిని వంటి కొంత మంది ఫాసిజంతో ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తే రష్యాలో స్టాలిన్ సారథ్యంలో వారిని ఎదుర్కొని ఫాసిజాన్ని కూకటివేళ్లతో నిర్మూలించారని గుర్తుచేశారు. ఫాసిజంపై ఎర్రజెండా మాత్రమే పారాడిందన్నారు. ఏప్రిల్ 22న పెహల్గామ్ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోడం బాధాకరమని, దీన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. పొలిట్ బ్యూరో బీవీ.రాఘవులు మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల దాడి నుంచి రక్షణ లేదని, ప్రజా రక్షకుడని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్కు ఇవి పట్టవా అని ప్రశ్నించారు. కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్, సీపీఎం జిల్లా నేతలు నాగరాజు, కందారపు మురళి, పుల్లయ్య, జనార్థన్, సుబ్రమణ్యం, ఆర్.లక్ష్మి, జయచంద్ర, సాయిలక్ష్మి పాల్గొన్నారు.