
ట్రాఫిక్ నియంత్రణకు రైల్వే అండర్పాస్లు
తిరుపతి మంగళం : తిరుపతి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను నియంత్రించేందుకు రైల్వే అండర్ పాస్ నిర్మాణాలు చేపడుతున్నట్టు ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. తిరుపతి నగర పరిధిలోని హీరోహోండా షోరూమ్ ఎదురుగా, శెట్టిపల్లి వద్ద రైల్వే అధికారులు నిర్మిస్తున్న రైల్వే అండర్పాస్ నిర్మాణాలను మంగళవారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. రైల్వే అండర్పాస్ నిర్మాణాల్లో నాణ్యతను పరిశీలించి ఎంత ఎత్తు నిర్మిస్తున్నారు, అండర్ పాస్లో నిలబడి వరదనీరు బయటకు పంపేందుకు చేస్తున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెస్ట్ చెర్చ్, ఆర్సీరోడ్డు, ఈస్ట్ పోలీస్టేషన్ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఇక్కడ లేకుండా చూడాలన్నారు. భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గత వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహకారంతో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అభినయ్రెడ్డి అనేక మాస్టర్ప్లాన్ రోడ్లను నిర్మించారని గుర్తుచేశారు. అయితే తిరుపతి నగరంలోని రైల్వే మార్గాల్లో గేట్లను పదే పదే వేస్తుండడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రితో చర్చించి రూ.12 కోట్లతో తిరుపతి–రేణిగుంట రోడ్డులోని హీరోహోండా షోరూం, శెట్టిపల్లి వద్ద రెండు రైల్వే అండర్పాస్ నిర్మాణాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.