
నీట్..ప్రశాంతం
● తిరుపతిలో 9, గూడూరులో 1 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ ● 97.48 శాతం మంది హాజరు ● 112 మంది పరీక్షలకు గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం తిరుపతిలో 9, గూడూరులో 1, మొత్తం పది పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన నీట్ ప్రశాంతంగా జరిగింది. ఎన్టీఏ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 4,445 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 112 మంది గైర్హాజరవ్వడంతో 4,333 (97.48శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. నీట్ రాసేందుకు ఉదయం 11గంటల నుంచే విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని నిబంధనలకు అనుగుణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.
తల్లిదండ్రుల ఆందోళన
నీట్ పరీక్షా కేంద్రంలోకి ఉదయం 11 గంటల నుంచి అనుమతించాలని ఎన్టీఏ నిబంధనల్లో పేర్కొంది.అయితే తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఉదయం 11.30 గంటలు అయినా లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న అధికారులు, పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో 11.40 గంటలకు విద్యార్థులను లోపలికి అనుమతించారు.
గందరగోళం
ఆలస్యంగా అనుమతించిన నేపథ్యంలో విద్యార్థులను సక్రమంగా తనిఖీ చేపట్టకుండా అనుమతించేశారు. లోపల వారి అడ్మిట్ కార్డులను పరిశీలించిన అధికారులు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సిన కొందరి విద్యార్థులను గుర్తించి వారిని పంపించేశారు. అప్పటికే సమయం మించి పోతుండడంతో పోలీస్ సిబ్బంది వారిని తమ ద్విచక్ర వాహనాలపై మహిళా యూనివర్సిటీ పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లి దిగబెట్టారు.
శ్రీపద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద బారులు తీరిన నీట్ విద్యార్థులు
పరీక్షను మళ్లీ నిర్వహించాలి
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల కేంద్రంలో నిర్వహించిన నీట్ను తిరిగి నిర్వహించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలో కనీసం గోడ గడియారం కూడా లేకపోవడంతో ఎంత సమయం అయిందో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని వాపోయారు. 11 గంటల నుంచే అనుమతించాల్సి ఉన్నప్పటికీ ఆ కళాశాల ప్రిన్సిపల్ అనుమతించలేదని, దీంతో తాము ఆందోళన చేపట్టడంతో 11.40 గంటలకు అనుమతించారని వాపోయారు. పరీక్ష ప్రారంభానికి ముందే అటెండెన్స్కు సంబంధించిన అన్ని వ్యవహారాలను పూర్తి చేయాల్సి ఉందని, అయితే పరీక్షా నిర్వహణాధికారుల అవగాహన రాహిత్యం వలన పరీక్ష ప్రారంభమయ్యాక జవాబు పత్రాలపై ఫొటోలు అంటించడం, వేలిముద్రలు వేయడం, సంతకాలు తీసుకోవడం వంటి పనులతో విద్యార్థుల విలవైన సమయాన్ని కోల్పోయారని, ఇన్విజిలేటర్ల అలసత్వం విద్యార్థులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణాధికారుల అలసత్వం, ఆ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

నీట్..ప్రశాంతం