
వర్షాలతో అప్రమత్తం
తిరుపతి అర్బన్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందస్తుగా వచ్చిన నేపథ్యంలో వర్షాల విషయంలో అధికారులు అప్రత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్(ఎన్ఓపీ) ప్రకారం ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామమోహన్, భానుప్రకాష్రెడ్డి, కిరణ్మయి, డీపీఓ సుశీలాదేవి, ఐసీడీఎస్ పీడీ వసంతబాయ్ తదితరులు పాల్గొన్నారు.
బదిలీల టెన్షన్
తిరుపతి అర్బన్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల అంశం హాట్ టాపిక్గా మారింది. బదిలీల ప్రక్రియ పూర్తి చేయడానికి ఇక రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యేల లెటర్లతో విజయవాడకు క్యూకడుతున్నట్లు చర్చసాగుతోంది. బదిలీల నేపథ్యంలో వారం రోజులుగా పలు విభాగాల్లో పాలన కూడా స్తంభించింది. వచ్చే సోమవారం సాయంత్రానికి బదిలీల జాబితా విడుదలవుతుందని ఉద్యోగులు అంటున్నారు. ఏ స్థానంలో ఎవరు ఉంటారో ఏ స్థానం నుంచి ఎవరు బదిలీ అవుతారో తెలియడం లేదు. ఇదిలావుండగా కలెక్టరేట్లోని ఓ విభాగం ఇన్చార్జిగా పనిచేస్తున్న మహిళా అధికారి తిరుపతి అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె గతంలో చంద్రగిరి తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన ఓ అధికారి కూడా తిరుపతికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
కండలేరు ఇన్చార్జి ఈఈగా రామచంద్రమూర్తి
రాపూరు: మండలంలోని కండలేరు జలాశయం ఇన్చార్జి ఈఈగా రామచంద్రమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నెల్లూరు డివిజన్ 2లో ఈఈగా పనిచేస్తూ కండలేరుకు ఇన్చార్జి ఈఈగా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఈ విజయకుమార్రెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పిస్తూ చిత్తూరు జిల్లా గాలేరు–నగిరి సుజల స్రవంతికి బదిలీ చేశారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 69,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలగుతున్నారు.

వర్షాలతో అప్రమత్తం