
రాత్రి పూట కౌన్సెలింగ్
● 273 మంది ఎస్జీటీ ఉద్యోగోన్నతులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ● రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ● అవస్థల్లో ఉపాధ్యాయులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ పరిశీలన.. రాత్రి 7 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన టీచర్లు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇష్టానుసారంగా బదిలీ ఉత్తర్వులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లకు శుక్రవారం బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఈ ఉత్తర్వుల్లో అవకతవకలు, ఇష్టానుసారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్, గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న టీచర్లు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న టీచర్లకు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో మినహాయింపు కల్పించాల్సి ఉంటుంది. వారు ఆన్లైన్లో నమోదు చేసుకున్న ప్రాంతాలకు బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది టీచర్లకు శ్రీకాళహస్తి నుంచి మదనపల్లికి, నాగలాపురం నుంచి పెద్దమండ్యం, శ్రీకాళహస్తి నుంచి చౌడేపల్లి ఇలా దూరప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ విషయం పై బాధితులు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల వద్దకు వచ్చి సంప్రదిస్తుంటే తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులెత్తేశారు.
273 మందికి ఉద్యోగోన్నతులు
జిల్లాలోని ప్రభుత్వ, మున్సిపల్, జెడ్పీ, నగరపాలక యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి, ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్ పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 273 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శుక్రవారం రాత్రి మొత్తం కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగోన్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు.