అవినీతి లేదు! | - | Sakshi
Sakshi News home page

అవినీతి లేదు!

Jun 7 2025 1:12 AM | Updated on Jun 7 2025 1:12 AM

అవినీతి లేదు!

అవినీతి లేదు!

అభివృద్ధి తప్ప..
● తుడా చైర్మన్‌కు ఎలాంటి ఎగ్జిక్యూటీవ్‌ పవర్‌ ఉండదు ● నిస్పక్షపాత విచారణ జరిగితే.. మాకష్టం ప్రజలకు తెలుస్తుంది ● మీడియాతో తుడా మాజీ చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

తిరుపతి రూరల్‌ : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)లో అభివృద్ధి పనులు చేయడం తప్ప.. అవినీతికి ఆస్కారం లేదని, అక్కడ చైర్మన్‌కు ఎలాంటి కార్యనిర్వహణ అధికారాలు ఉండవని తుడా మాజీ ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేర్కొన్నారు. తుడాలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తుడా అథారిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏదేదో అసత్య ప్రచారాలను పత్రికల్లో రాస్తే వారిపై పరువునష్టం దావా వేయడానికి వెనుకాడనని తుడా మాజీ ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వెల్లడించారు. తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని ఆయన ఇంటి వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఒక చిన్న కార్యాలయంలా ఉన్న తుడా ఆఫీసును ఒక కార్పొరేట్‌ కార్యాలయం మాదిరిగా రూపుదిద్దామన్నారు. తిరుపతి నగరంతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రెండు మండలాలకు పరిమితమైన తుడాను 9 నియోజక వర్గాలకు విస్తరింపజేయడం జరిగిందన్నారు. తుడా చైర్మన్‌కు టీటీడీ పాలక మండలిలో ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా జగనన్న ప్రభుత్వంలో తీసుకొచ్చామన్నారు. నెల్లూరు అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ కింద ఉన్న శ్రీసిటీని జగనన్న సహకారంతో తుడా పరిధిలోకి తీసుకొచ్చామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఏళ్ల తరబడి ఒకే హోదాలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇప్పించడం జరిగిందన్నారు.

తుడా ఆదాయం రెట్టింపు

2019లో తుడా చైర్మన్‌గా తాను బాధ్యత తీసుకునే సమయానికి రూ.26 కోట్ల బడ్జెట్‌ ఉండేదన్నారు. ఆ తరువాత వందల కోట్లు ఆదాయంగా తీసుకొచ్చి మొదటి ఏడాదికి రూ.15 కోట్లకు పైగా ఉద్యోగుల భవిష్యత్తు కోసం ిఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వేయడం జరిగిందన్నారు. ఏళ్లుగా సూరప్పకశం వద్ద 145 ఎకరాలు ఆక్రమణ భూమిని తుడాకు తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల్ల స్థలాలకు విక్రయించి తుడాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టామని చెవిరెడ్డి వివరించారు. అన్నమయ్య సర్కిల్‌ వద్ద తుడా టవర్స్‌ను తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి విడిపించి తుడాకు అప్పగించడం వల్లనే తుడా టవర్స్‌ వచ్చాయన్న వాస్తవం గుర్తించాలన్నారు. తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం వద్ద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కొందరు 15 ఎకరాల స్థలం ఆక్రమిస్తే సొంత పార్టీ వాళ్లు అని కూడా చూడకుండా వారితో న్యాయ పోరాటం చేసి ఆ స్థలాలు తుడాకు స్వాధీనం చేసి ప్లాట్లుతో తుడాకు ఆదాయం వచ్చేలా చేశామని ఆయన చెప్పారు.

అవును.. చంద్రగిరికే ఎక్కువ పెట్టాను..

చంద్రగిరికి తుడా నిధులు అధికంగా ఖర్చు పెట్టారని చెబుతున్నారు.. అవును నిజమే.. ఎక్కువ గానే పెట్టాను.. ఏ దేశానికి రాజైనా తల్లికి బిడ్డ అన్న చందంగా రాజకీయాల్లో తాను ఏ స్థాయికి ఎదిగినా తల్లివంటి చంద్రగిరికి తాను బిడ్డనేనని, అందుకే అధికంగా ఖర్చు చేసి అభివృద్ది చేశానని చెవిరెడ్డి వివరించారు. ఇప్పుడు జరిగే విజిలెన్స్‌ విచారణలో కూడా నిస్పక్షపాతంగా నివేదిక తయారు చేస్తే తాము చేసిన అభివృద్ధి పడిన కష్టం ప్రజలకు తెలుస్తుందన్నారు. ఏ తప్పు జరగకున్నా తప్పు జరిగినట్లు నివేదిక ఇస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

తుమ్మలగుంట చెరువు అభివృద్ధి తప్పా

మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన హరిక్రిష్ణ వీసీగా పనిచేయడం వల్ల ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని, తుడా పాలనలో అధికారాలన్నీ ఆయనకే ఉంటాయన్నారు. తుమ్మలగుంట చెరువు అభివృద్ధి చేయడం తప్పే అయితే చంద్ర బాబు ఆదేశాలతో అవిలాల చెరువుకు టీటీడీ రూ.70 కోట్లు ఖర్చు చేయడం కూడా తప్పే అవుతుందని చెవిరెడ్డి తెలిపారు. చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయంలో చోడవరం నియోజకవర్గ పరిధిలో సిమెంటు బెంచీలు తయారు చేయించి ఒక్కో బెంచీకి రూ.15,750 చెల్లించారని, ఐదేళ్ల తరువాత అదే క్వాలిటీతో అదే కొలతలతో అదే కాంట్రాక్టర్‌ చేత ఒక బెంచీ రూ.8 వేలుకు తయారు చేయించామన్నారు. ఇందులో ఏది ఎక్కువ..? ఎక్కడ అవినీతి జరిగిందో పెద్దలు ఆలోచించాలని సూచించారు. తుడా పరిధి రెండు నియోజకవర్గాల నుంచి రెండు జిల్లాలకు విస్తరించినప్పుడు ఉద్యోగులు, వారి జీతాలు, రవాణా వంటి ఖర్చులు పెరుగుతాయన్న విచక్షణ కూడా తెలియడం లేదన్నారు. తుడాకు టీటీడీ బోర్డులో స్థానం కలిగినప్పుడు తిరుపతి పర్యటనకు వచ్చే ప్రముఖుల ప్రొటోకాల్‌కు వాహనాలను పెట్టినమాట వాస్తవమేనని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement