
పెళ్లింట విషాదం
● కూతురి పెళ్లి పనులకు వెళ్లి తండ్రి హఠాన్మరణం
కేవీబీపురం: మరికొద్ది రోజుల్లో జరగాల్సిన పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. కూతురి పెళ్లి పనుల్లో నిమగ్నమైన తండ్రి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కేవీబీపురం మండలం కోవనూరు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోవనూరు గ్రామానికి చెందిన సాంబయ్య(43) తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన పెద్ద కుమార్తెకు శ్రీకాళహస్తి రాజీవ్నగర్కు చెందిన వ్యక్తితో ఈనెల 8వతేదీన వివాహం నిశ్చయించుకున్నారు. ఈ తరుణంలొ సాంబయ్య విధులకు లీవు పెట్టి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం శ్రీకాళహస్త్రిలో షాపింగ్ ముగించుకుని ఇంటికి తిరుగు వెళుతుండగా సాంబయ్య గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు శ్రీకాళహస్త్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాంబయ్య మృతితో కోవనూరులొ విషాదఛాయలు అలుముకున్నాయి. కేవీబీపురం ఎస్ఐ నరేష్ చేతుల మీదుగా సాంబయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం సాంబయ్య అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తి చేశారు.

పెళ్లింట విషాదం