
పోలీసుల తీరుపై ఆర్డీఓ అసహనం
కలువాయి(సైదాపురం): కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో రెవెన్యూ సమస్యలపై వినతిపత్రాలు అందించేందుకు అర్జీదారులు పోటెత్తారు. అయితే అర్జీదారులను నియంత్రించడానికి ఒక్క పోలీసు మాత్రమే వచ్చారు. ఆయన అర్జీదారులను కట్టడి చేయలేకపోవడంతో ఆర్డీఓ పావని పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీకు లెటర్ పెట్టాం కదా ?’ అని పోలీసులను అడగ్గా.. సిబ్బంది తక్కువగా ఉన్నారని సమాధానం చెప్పారు. అయితే కొందరు అర్జీదారుల మధ్య పొలం, దారి సమస్యలపై గొడవలు జరగడం.. వారిని పోలీసులు నిలువరించలేకపోవడంతో ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనులకు అవగాహన కల్పించండి
తిరుపతి అర్బన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామఉత్కర్ష అభియాన్ పథకం ద్వారా గిరిజనుల సాధికారత, ఆర్థిక, సామాజికాభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు.