
మన జీవితంలో యోగా భాగం కావాలి
చంద్రగిరి: ప్రతి ఒక్కరి దైనందిత జీవతంలో యోగ ఒక భాగం కావాలి అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం చంద్రగిరి కోటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ప్రజలు, జిల్లా అధికారులు, విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అంతటా యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. సీఎం పిలుపు మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాంధ్ర క్యాంపెన్లో భాగంగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కోటలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు చెప్పిన విధంగా ఆసనాలను ఆసక్తిగా వింటూ ప్రజలు, అధికారులు, యువత మహిళలు ఆసనాలు వేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, మహిళలు, విద్యార్థులు, పాల్గొన్నారు.
చంద్రగిరి కోటలో అట్టహాసంగా యోగాంధ్ర
పాల్గొన్న జిల్లా కలెక్టర్, అధికారులు యువత, మహిళలు, విద్యార్థులు