
తారాస్థాయికి జనసేన నేతల వర్గపోరు
● కార్యక్రమం ఏర్పాట్లలో వివాదం, ఘర్షణ ● ఒకరికి కత్తి పోట్లు
చిల్లకూరు : గూడూరు నియోజకవర్గంలో జనసేన నేతలు, కార్యకర్తల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం జనసేన నేతలు పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. ఒక వర్గానికి చెందిన వారు బుధవారం రాత్రి టపాకాయలు తీసుకుని వచ్చేందుకు గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన వారు అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో సాయి అనే యువకుడిపై మరో వర్గానికి చెందిన యువకుడు కత్తితో దాడి చేశాడు. అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా కాలికి గాయమైంది. దాడికి పాల్పడిన వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన సాయిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో గూడూరు పట్టణంలో అల్లర్లు, దాడులు, ప్రతిదాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. రెండు రోజుల క్రితం రెండో పట్టణంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీన్ని మరువకనే జనసేన కార్యకర్తల మధ్య వర్గపోరు జరిగి కత్తితో దాడులు చేసుకునే వరకు రావడంతో పట్టణ ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గట్టి చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యా మండలి సమావేశానికి వీసీ
తిరుపతి సిటీ : మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వీసీలు, రిజిస్ట్రార్ల సమావేశానికి ఎస్వీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధు మూర్తి, ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ ఆధ్వర్యంలో చేపట్టిన సమావేశంలో వర్సిటీల పాలన, పరిశోధనాభివృద్ధి, రీసెర్చ్ పబ్లికేషన్, ప్రపంచ ర్యాంకుల స్థాయి మెరుగుపరచడం, అధ్యాపకుల కొరత, భర్తీ ప్రక్రియ, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.
దేవదాయశాఖ ఇన్స్పెక్టర్పై కక్ష
కాణిపాకం : జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సుమనప్రియ సస్పెన్షన్ వెనుక అంతర్యమేమిటో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల కిందట బంగారుపాళ్యం మండలంలోని శ్రీ మొగిలి దేవస్థాన హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించారంటూ కొందరు వ్యక్తులు (కూటమి నేతలు) శనివారం దేవదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన మరుసటి రోజే దీనిపై ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే విచారణకు పిలిచారు. అత్యవసరంగా ఆదివారం విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ఆ శాఖ అధికారులే ఓ అధికారి తీరుపై మండిపడుతున్నారు. కక్ష పూరితంగానే సుమన ప్రియను సస్పెండ్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షులుగా ఉన్న వ్యక్తులు లెక్కించే సమయంలో సీసీ ఫుటేజీలో ఉన్నారా..? సీసీ ఫుటేజీలో సుమన ప్రియ డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా ? అనే విషయాలు అధికారులు దాచి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి, కూటమి నేతలకు అంటకాగిన కొందరు అధికారులు సుమన ప్రియపై కక్ష కట్టి సస్పెండ్కు పూనుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈమెను సస్పెండ్ చేసి కార్యాలయంలో పనిచేసే మరో అధికారికి ఈ సీటును కేటాయించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున రాజకీయాలు నడిచినట్లు విమర్శలు వస్తున్నాయి.