
అర్జున్దాస్ గది తలుపులు తెరిచిన అధికారులు
తిరుపతి కల్చరల్: శ్రీస్వామి హథీరాంజీ మఠం మాజీ మఠాధిపతి అర్జున్దాస్ అధికారిక గది(డోలు)ను దేవదాయశాఖ అధికారులు, మఠం పరిపాలన అధికారి బాపిరెడ్డి, మఠాధిపతి ఓంప్రకాష్దాస్ సమక్షంలో బుధవారం తెరిచి పంచనామా నిర్వహించారు. మఠాధిపతిగా అర్జున్దాస్ ఉన్నప్పుడు మఠం నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమాలకు, భూములు అన్యాక్రాంతానికి పాలు పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ అర్జున్ దాస్ను సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించింది. ఈమేరకు అర్జున్ దారు అధికారిక గదిని 2023 జూన్ 8వ తేదీన అధికారులు సీజ్ చేశారు. అప్పటి నుంచి అర్జున్దాస్ మళ్లీ మఠాధిపతిగా కొనసాగేందుకు కోర్టుల ద్వారా ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మఠాధిపతిగా ఓం ప్రకాష్ను ధార్మిక పరిషత్ నియమిస్తూ మఠం ఆధీనంలోని ఆలయాలకు సంబంధించిన కార్యకలాపాలను చూసుకోవాలని పరిషత్ సూచించింది. అర్జున్దాస్ అధికార గదిలో ఉన్న వస్తువులు, రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని బాపిరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ రెవెన్యూ విభాగం స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ డాక్టర్ కె.సత్యవతి, దేవదాయ శాఖ ఆర్జేసీ కార్యాలయ తహసీల్దార్ వీఆర్ కృష్ణ, మఠం సూపరింటెండెంట్ కేశవులు, మఠం లా ఆఫీసర్ కవిత, ల్యాండ్స్ క్లర్క్ సీతారామయ్య, మఠం సిబ్బంది పాల్గొన్నారు.