సబ్సిడీ వేరుశనగ.. | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ వేరుశనగ..

Jun 5 2025 7:52 AM | Updated on Jun 5 2025 7:52 AM

సబ్సిడీ వేరుశనగ..

సబ్సిడీ వేరుశనగ..

● పచ్చనేతలకే తొలి ప్రాధాన్యత ● జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో వేరుశనగ సాగు ● ఎకరాకు 1.20 క్వింటాళ్లు అవసరం.. అంటే 12 వేల క్వింటాళ్లు ఇవ్వాలి ● కానీ జిల్లాకు వచ్చింది 3,280 క్వింటాళ్లే ● ఎకరాకు ఒక బస్తా.. 3 ఎకరాలకు పైన ఎంత భూమి ఉన్నా గరిష్టంగా 3 బస్తాలే ● 40 శాతం రాయితీతో విత్తనకాయలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు ● ఆందోళనలో అన్నదాతలు

తిరుపతి అర్బన్‌: ఖరీఫ్‌ సీజన్‌ అనగానే మొదట సాగయ్యే పంట వేరుశనగ. ఈసారి 80 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 5 నుంచి 10 శాతం వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా వరి సాగు 60 వేల ఎకరాలు, వేరుశనగ పంట 10 వేల ఎకరాలు, ఆరుతడి పంటల్లో ప్రధానంగా నువ్వులు పంట 4 వేల ఎకరాలు, మిగిలిన 6 వేల ఎకరాల్లో జొన్నలు, సజ్జలు, రాగులు, మినుములు, కొర్రలు, అరికలు, సాములు తదితర పంటలు సాగుచేస్తారు.

10 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు..

జిల్లాలోని 34 మండలాల్లో తిరుపతి అర్బన్‌ మినహాయిస్తే మిగిలిన 33 మండలాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో 10 వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేయనున్నారు. 10 వేల ఎకరాల సాగుకు ఎకరాకు 1.20 క్వింటాళ్లు చొప్పున 12 వేల క్వింటాళ్లు వేరుశనగ విత్తనకాయలు అవసరం. అయితే ఈ సీజన్‌కు కేవలం 3,280 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయని అగ్రికల్చర్‌ అధికారులు అంటున్నారు. 30 శాతం మాత్రమే వేరుశనగ విత్తనాలు మాత్రమే జిల్లాకు చేరాయి. రేపోమాపో కూటమి నేతల చేత ప్రారంభోత్సవం చేయించిన తర్వాత పంపిణీ చేయడానికి అగ్రికల్చర్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

పచ్చనేతలకే తొలి ప్రాధాన్యత

30 శాతం మాత్రమే వేరుశనగ కాయలు రావడంతో తొలి ప్రాధాన్యత పచ్చనేతలకే ఇవ్వాలని ఇప్పటికే కూటమి నేతలు అగ్రికల్చర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో నిజమైన రైతులకు నష్టం తప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కే6, డీసీజీఎస్‌ 1694 రకాల వేరుశనగ కాయలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. మార్కెట్‌లో డిమాండ్‌ లేని రకాలు వచ్చాయని పలువురు రైతులు విమర్శలు చేస్తున్నారు.

ఆందోళనలో అన్నదాతలు

40 శాతం రాయితీతో విత్తనాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కేజీ వేరుశనగ కాయలు రూ.93. అయితే అందులో సబ్సిడీ 37.20 మినహాయిస్తే కేజీ రూ.55.80 చొప్పున రైతులకు అందజేయనున్నారు. మొత్తంగా 30 కేజీల బస్తా రూ.1674కి రైతులకు అందించనున్నారు. జిల్లాలో 442 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. అయితే అందులో 160 రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు లేరు. దీంతో కొందరు అగ్రికల్చర్‌ అసిసెంట్లకు రెండు రైతు సేవా కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. రైతు పాస్‌ పుస్తకాల జెరాక్స్‌లను అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకు సమర్పించాల్సి ఉంది. కనిష్టంగా ఎకరం భూమి ఉన్న రైతుకు ఒక బస్తా(30కేజీలు).. రెండు ఎకరాలు ఉంటే 2 బస్తాలు, మూడు ఎకరాలు ఉంటే 3 బస్తాలు ఇవ్వాలని నిర్ణయించారు. 3 ఎకరాలకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా గరిష్టంగా 3 బస్తాలు మాత్రమే ఇవ్వనున్నారు. అయితే ఒక ఎకరం సాగుకు 30 కేజీల బస్తాలు 4 సంచులు అవసరం అవుతాయి. అంటే 120 కేజీలు ఎకరా పొలంలో పంట సాగుకు అవసరం ఉంటుంది. గరిష్టంగా 3 బస్తాలు ఇస్తే ఒక్క ఎకరం కూడా పంటను సాగు చేయలేమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్‌లో రైతులకు కష్టాలు తప్ప.. ప్రయోజనాలు కల్పించడం లేదని పలువురు వాపోతున్నారు. మొత్తంగా రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలు అందుతాయో లేదో రెండు రోజులు వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement