
జగనన్న పాలనలో ప్రభుత్వ విద్యకు అందలం
పేదరికం చదువులకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. జిల్లాలో ప్రతి ఏటా 2.57లక్షల మందికి అమ్మఒడి ద్వారా పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలో ఏడాదికి రూ.14వేలు చొప్పున నగదు జమచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో బైజూస్తో ఒప్పందం కుదుర్చుకుని సుమారు 1.13 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఐబీ (ఇంటర్నేషనల్ బేసిక్ కరికులమ్) సిలబస్తో అంతర్జాతీయ స్థాయి విద్యనందించారు. ప్రపంచంతో పోటీ పడేలా సీబీఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. నాడు–నేడు పథకం ద్వారా జిల్లాలోని 1,021 ప్రభుత్వ పాఠశాలలను రూ.574కోట్లతో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. ప్రతి ఏడాదీ పది, ఇంటర్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఘనంగా సత్కరించి ప్రోత్సాహకాలను అందించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విదేశీ పర్యటన పేరుతో అమెరికా వైట్హౌజ్, ఐక్యరాజ్య సమతి సభలో ప్రసంగించే అవకాశాన్ని కల్పించారు. పేద విద్యార్థులు ఇంటర్తోనే చదువు ఆపేయకుండా డిగ్రీ వైపు ప్రొత్సహించి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో యూజీ చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికీ విద్యాదీవెన పేరుతో ప్రతి ఏడాదీ ఫీజురీయింబర్స్మెంట్ అందించారు. గతంలో చంద్రబాబు సర్కార్ బకాయిలు పెట్టిన సుమారు రూ.245 కోట్ల ఫీజురీయింబర్స్ మెంట్ను సైతం 2019లో అధికారం చేపట్టిన మూడు నెలలకే చెల్లించారు. దీంతో పాటు అర్హులైన ప్రతి యూజీ విద్యార్థికి వసతి దీవెన కింద రూ.648కోట్ల మేర అందించారు. విద్యారుణాలు జిల్లాలో 1,870 మందికి రూ.56 కోట్లకుపైగా అందించారు. విదేశీ విద్యను ప్రొత్సహించారు. ఇందు కోసం రూ.252.27 కోట్లు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో గోరుముద్దు పేరుతో రుచికరమైన పోషకాహారం అందిస్తూ విద్యార్థులను ఆకట్టుకున్నారు.