– సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈనెల 27వ తేదీన నిర్వహించే మండల ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీ అయిన స్థానాలకు ఈనెల 27వ తేదీన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని రామకుప్పం (మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు), తవణంపల్లి (మండల పరిషత్ అధ్యక్షుడు), విజయపురం (ఉపాధ్యక్షుడు), సదుం (మండల పరిషత్ అధ్యక్షుడు), తిరుపతి (మండల పరిషత్ అధ్యక్షుడు), పెనుమూరు, పీలేరు ( కో ఆప్షన్ సభ్యుల ) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలకు ఎంపీడీఓలు పీవో లుగా వ్యవహరిస్తారన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. సభ్యులు తగినంత మంది హాజరుకాకపోతే ఈనెల 28వ తేదీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. డీఆర్ఓ మోహన్కుమార్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
గాయపడిన విద్యార్థి మృతి
తడ: పెరియవట్టు గ్రామం వద్ద ఈ నెల 23వ తేదీ కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో గాయపడి చైన్నె స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాదేష్(21) విద్యార్థి సోమవారం రాత్రి మృతి చెందాడు. విహర యాత్ర కోసం తమిళనాడులోని తాంబరం నుంచి చైన్నెలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇతర మిత్రులతో కలసి ఆదివారం వరదయ్యపాళెంలోని ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి కారులో వస్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని ఓ యువతితో సహా ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. మిగిలిన ఆరుగురు చైన్నెలో చికిత్స పొందుతున్నారు. వారిలో మాదేష్ మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరిందని ఎస్ఐ కొండపనాయుడు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు