చంద్రగిరి : శ్రీసాయినాథనగర్లోని మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) 33వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సినీనటులు శరత్కుమార్, ప్రభుదేవా హాజరయ్యారు. నాగఫణిశర్మ మాట్లాడుతూ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం నెలకొల్పడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. రాయలసీమలో ఇంత గొప్ప విద్యాలయం నిర్వహిస్తున్న మోహన్బాబు ఆదర్శనీయులని కొనియాడారు. కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ మోహన్బాబు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత యువతకు ఉందని పిలుపునిచ్చారు. శరత్కుమార్ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా ఎంబీయూ నిలుస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను మోహన్బాబు చేతులమీదుగా ఘనంగా సత్కరించారు.
అందరి వాడిని : మోహన్బాబు
కులపతి అంటే ఏ కులానికి అధిపతి అని అనుకునే పరిస్థితి నేడు ఉందని మోహన్ బాబు తెలిపారు. తాను ఏ కులానికి చెందిన వాడిన కానని, అందరి వాడినంటూ వెల్లడించారు. అన్ని పార్టీలు నాకు కావాల్సినవే అని వివరించారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వారు ఎవరూ ఉన్నతస్థాయికి వెళ్లలేరని తెలిపారు. మైఖేల్ జాక్సన్ తర్వాత ప్రపంచంలోనే ఉత్తమ డ్యాన్సర్ ప్రభుదేవా అని ప్రశంసించారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన ప్రభుదేవాతో కలసి డ్యాన్స్ చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు.
ఘనంగా ఎంబీయూ వార్షికోత్సవం