
పిచ్చాటూరు: నాగలాపురంలో సూర్యపూజ తెప్పోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ వేదనారాయణ స్వామి శిరస్సును స్పృశిస్తూ వెచ్చదనాన్ని అందించేలా సూర్యకిరణాలు తాకాయి. సాయంసంధ్యా వేళ భాస్కర తేజాలు ఆలయ ద్వార గోపురం, బలిపీఠం, ద్వజస్తంభం గుండా మెల్లగా గర్భాలయంలోకి ప్రవేశించాయి. 650 అడుగుల దూరంలోని మూలవిరాట్ శిరస్సుపై ప్రసరించాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. కిరణాలు స్వామివారి శిరస్సును తాకిన వెంటనే భక్తుల గోవిందనామస్మరణ హెరెత్తింది. అనంతరం మంత్రయుక్త జలంతో పరిచారికలు, అర్చకులు కిరణ ప్రసార మార్గాన్ని అభిషేకించి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం స్నపన తిరుమంజనాన్ని వేడుకగా చేపట్టారు.
వేడుకగా తెప్పోత్సవం
సాయంత్రం సూర్యపూజ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామి ఉత్సమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి తిరుచ్చిపై ఆశీనులు చేసి పుష్కరిణికి వేంచేపు చేశారు. పుష్కరిణిలోని తెప్పపై స్వామి, అమ్మవార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి నిజాలయంలో శ్రీ వేదనారాయణుడికి ఏకాంత సేవ నిర్వహించారు. దీంతో ఈ ఏడాది సూర్యపూజ తెప్పోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కోవిడ్ కారణంగా మూడేళ్ల తరువాత సూర్యపూజ తెప్పోత్సవాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సత్యవేడు సీఐ శివకుమార్రెడ్డి, ఎస్ఐలు హనుమంతప్ప, శ్రీకాంత్రెడ్డి, పురుషోత్తం రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు.
వేదనారాయణుని శిరస్సును స్పృశించిన సూర్యకిరణాలు నాగలాపురంలో సూర్యపూజ
తెప్పోత్సవాలు పరిసమాప్తం


పుష్కరిణిలో తెప్పపై విహరిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి