
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హసన్పర్తి(వరంగల్) : ఎలుకను మింగేందుకు యత్నించిన పాము అది తప్పించుకోవడంతో అక్కడే ఓ మహిళపై కాటు వేయగా ఆమె మృతి చెందింది. హన్మకొండ 65వ డివిజన్ చింతగట్టులోని సుభాష్నగర్కు చెందిన పుల్లా కమలమ్మ(55) మరికొందరితో కలిసి మంగళవారం ఉదయం బయట కూర్చుని మాట్లాడుతోంది.
కాగా, కమలమ్మ వెనుక వైపు నుంచి ఎలుక వెళ్తుండగా.. దానిని పట్టుకునేందుకు పాము వచ్చింది. అయితే, ఎలుక క్షణంలో తప్పించుకోవడంతో పాము కింద కూర్చోని ఉన్న కమలమ్మ చేతిపై కాటు వేసింది. పరిస్థితిని గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.