ప్రాణహిత–చేవెళ్లను పక్కనపెట్టడం పెద్ద తప్పిదం! | Vedire Sriram PowerPoint Presentation to Justice PC Ghosh Commission | Sakshi
Sakshi News home page

ప్రాణహిత–చేవెళ్లను పక్కనపెట్టడం పెద్ద తప్పిదం!

Jul 17 2024 5:00 AM | Updated on Jul 17 2024 5:00 AM

Vedire Sriram PowerPoint Presentation to Justice PC Ghosh Commission

కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ ఆరోపణ

కొందరి ప్రయోజనాల కోసమే రీ–ఇంజనీరింగ్‌!

మేడిగడ్డ బరాజ్‌ స్థలం ఎంపిక తప్పే

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదు

కాళేశ్వరం డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించింది

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరణ

సాక్షి, హైదరాబాద్‌:  కొందరి నిర్దిష్ట ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్‌ చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్‌ స్థలం ఎంపిక పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. చిన్న కారణాలు చూపి ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని పక్కనపెట్టి.. దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను ఆమోదించినది కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) అని, దీనికి కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

మంగళవారం వెదిరె శ్రీరామ్‌ కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణం, లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు హాజరై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తన ఫిర్యాదుకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం వెదిరె శ్రీరామ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్‌ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం వెనుక ఎన్నో తప్పులు ఉన్నాయని ఆరోపించారు.

సీడబ్ల్యూసీ నీటి లభ్యత ఉందనే చెప్పింది!
గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని నాలుగు కారణా లతో పక్కనపెట్టిందని.. అక్కడ నీటి లభ్యత లేదన డం అందులో ఒకటని వెదిరె శ్రీరామ్‌ చెప్పారు. కానీ 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ/నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లు వచ్చే వరద) ఆధారంగా 165 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని సీడబ్ల్యూసీ పేర్కొందని తెలిపారు. 

ఇక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రిజర్వాయర్ల సంఖ్యను పెంచాల ని సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిందని గత ప్రభుత్వం మరో కారణంగా చూపిందని.. కానీ ప్రాణహిత– చేవెళ్ల పథకం కింద కూడా అలా కట్టేందుకు అవకా శం ఉండేదని వివరించారు. దీనికితోడు తుమ్మిడి హెట్టి వద్ద బరాజ్‌ నిర్మిస్తే మహారాష్ట్రలో 3,600 ఎక రాల ముంపు ఉంటుందని, ఆ రాష్ట్రం ఒప్పుకోదని మూడో కారణంగా చూపారన్నారు. 

అయితే ఎప్పుడైనా భారీ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య ఉంటుందని.. సేకరించాలనే తపన ఉంటే మహా రాష్ట్రలో 3 వేల ఎకరాలు సేకరించడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు కోసం 2015 సంవత్సరం నాటికి రూ.11,917 కోట్లు ఖర్చ య్యాయని.. ఆ దశలో ప్రాజెక్టును పక్కనపెట్టడం సహేతుకం కాదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ కట్టి ఉంటే గ్రావిటీతో నీరు అందేదని.. అదే మేడిగడ్డ వద్ద కట్టడంతో ఏటా నీటి పంపింగ్‌కే రూ.11 వేల కోట్ల అనవసర వ్యయం అవుతుందని వివరించారు.

బ్యారేజీల వద్ద పరీక్షల వివరాలు రావాలి..
కాళేశ్వరం బరాజ్‌ వైఫల్యాలపై గత ఏడాది నవంబర్‌లో ఒక నివేదిక, తర్వాత మేలో మరో నివేదికను ఎన్డీఎస్‌ఏ ఇచ్చిందని వెదిరె శ్రీరామ్‌ చెప్పారు. బరాజ్‌ల వద్ద జియో టెక్నికల్, జియో ఫిజికల్, స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ పరీక్షలు పూర్తి చేసి, వివరాలను ఎన్డీఎస్‌ఏకు నివేదిస్తే.. ఎన్డీఎస్‌ఏ బరాజ్‌ల పరిస్థితి, భవిష్యత్తు చర్యలపై తుది నివేదికను అందించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

డీపీఆర్‌ ఆమోదానికి ముందే నిర్మాణం
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ ఆమోదానికి ముందే బరాజ్‌ల నిర్మాణం సగానికిపైగా పూర్తయిందని వెదిరే శ్రీరామ్‌ పేర్కొన్నారు. బరాజ్‌ల నిర్మాణంలో పలు లోపాలు ఉన్నట్టు ఎన్డీఎస్‌ఏ గుర్తించిందన్నా రు. గేట్ల నిర్వహణలోనూ వైఫల్యాలు ఉన్నాయన్నా రు. 2019లోనే బరాజ్‌లలో సమస్యలు వచ్చినా పరిష్కరించలేదన్నారు. డిజైన్‌ ఒక విధంగా ఉంటే, నిర్మాణం మరో విధంగా జరిగిందని పేర్కొన్నారు. నీటిని నిల్వ చేయడమే ముఖ్యమైతే.. రిజర్వాయర్లు కట్టి ఉండాల్సిందని.. బరాజ్‌లు కట్టి, రిజర్వాయ ర్లుగా వాడుకోవడం తప్పేనని స్పష్టం చేశారు.

వైఫల్యానికి కారణాలు అనేకం
కాళేశ్వరం బరాజ్‌ల వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, బ్యారేజీలు కట్టడానికి ముందు తగిన సాంకేతిక పరీక్షలు చేయకపోవడమే కారణమని వెదిరె శ్రీరామ్‌ ఆరోపించారు. డీపీఆర్‌ తయారీలో సాంకేతిక అంశాలు పట్టించుకోలేదని.. బరాజ్‌ల ఎంపిక ప్రదేశా ల్లో లోపాలున్నాయని పేర్కొన్నారు. 

డిజైన్ల తయారీ కోసం నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో)కు తగి నంత సమయం ఇవ్వలేదని.. ఉన్నత స్థాయిలో ఒత్తిడి చేసి, డిజైన్లకు ఆమోదం తీసుకున్నారని చెప్పారు. తాను నివేదించిన అంశాలతో వారంలో అఫిడవిట్‌ దాఖలు చే యాలని కమిషన్‌ ఆదేశించిందని, అఫిడవిట్‌ అందిస్తానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement