నిబంధనలకు విరుద్ధంగా... మల్టీప్లెక్స్, థియేటర్లలో ధరల బాదుడు

Multiplexes In Hyderabad To Sell Food Items More Costs - Sakshi

సాక్షి హైదరాబాద్‌: మల్టీప్లెక్స్, థియేటర్లలో ‘దోపిడీ’ ఆగడం లేదు. ప్యాకేజ్డ్‌ కమొడిటీస్‌ చట్టం అమలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. నిర్దేశించిన ధరలకే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్యాక్‌ చేసిన కొన్ని వస్తువుల ఎమ్మార్పీపై సైతం బాదేస్తున్నారు. ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు.  

యథేచ్ఛగా దోపిడీ.. 
ఐఎస్‌ఐ బ్రాండ్‌ లీటర్‌ మంచినీళ్ల ధర బహిరంగ మార్కెట్‌లో రూ.19. మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ. 25కు అమ్ముతున్నారు. 400 ఎంఎల్‌ కోకాకోలా ధర రూ.70., ఎగ్‌పఫ్‌ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్‌ రూ.160కు విక్రయించడం సర్వసాధారణమైంది. ఇక పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌ కంబై¯Œన్‌డ్‌ అప్‌సైజ్‌ కపుల్‌ కాంబోను జీఎస్‌టీ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ధరల సూచికలో పేర్కొన్న వాటి కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.  సంబంధిత నిర్వాహకులను నిలదీస్తే కేవలం ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని నిబంధన ఉందని, ప్యాకింగ్‌ లేని ఆహార పదార్థాల విషయంలో నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ ప్రేక్షక పాత్ర పోషించడం విస్మయానికి గురిచేస్తోంది. 

నిబంధనలు ఇలా.. 

  • తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎ మ్మార్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్‌ ఉండాలి. ఇవన్నీ వినియోగదారులుకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్ప టికప్పుడు మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. 
  • ఒకే బ్రాండ్‌ తినుబండారాలు కాకుండా వివిధ బ్రాండ్స్‌ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్‌ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎమ్మార్పీ, కస్టమర్‌ కేర్‌ వివరాలు  ఉంచాలి. ఎమ్మార్పీ ఉన్న ఫుడ్స్‌ మాత్రమే విక్రయించాలి. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్, వాట్సాప్‌ నంబర్‌ ప్రదర్శించాలి. 

కేసులకే పరిమితం 
మల్టీప్లెక్స్, థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, ఇతర తినుబండారాలు ఎమ్మార్పీపై కనీసం ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవన్న తూనికలు, కొలతల శాఖ కేవలం కేసుల నమోదుతో  చేతులు దులుపుకొంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు జరిమానా, రెండోసారి నిబంధనల ఉల్లంఘనకు రూ. 50 వేలు, మూడోసారి రూ. లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. అధికారులు మల్టీప్లెక్స్, థియేటర్ల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top