
పక్కింట్లో భార్యా భర్తల మధ్య గొడవ...
వివరాలు తెలుసుకునేందుకు వెళ్తే కత్తిపోట్లు
మైలార్దేవ్పల్లి(హైదరాబాద్): సమీపంలోని నివాసంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ గురించి తెలుసుకునేందుకు వారింటికి వెళ్లిన మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన సలీమ్, రేష్మ దంపతులు. బక్రీద్ పండగను పురస్కరించుకొని ఇక్కడ ఉంటున్న కూతురి దగ్గరికి వచ్చారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సలీమ్ మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. పెద్దగా అరుపులు వినిపిస్తుండటంతో పక్కనే ఉంటున్న జుబేదా (26) అనే మహిళ అక్కడికి వెళ్లింది. అప్పటికే సలీం కొట్టడానికి రావడంతో భార్య రేష్మ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది.
సలీం కూరగాయలు కోసే కత్తిని చేతపట్టుకొని ఆమె కోసం గాలిస్తున్నాడు. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన జుబేదాను తన భార్య అనుకొని కత్తితో పొడిచాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సలీం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని గాలించి పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జుబేదాను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.